కడప చేరుకున్న వైయస్ జగన్
వైయస్ఆర్ జిల్లా :ఎన్నికల్లో అఖండ విజయం సాధించాక తొలిసారి ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వచ్చారు. ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న వైయస్ జగన్ కొద్ది సేపటి క్రితం కడప నగరానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఆయన కడపలోని అమీన్పీర్ దర్గాను సందర్శించనున్నారు. అక్కడ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుని హెలికాప్టర్లో బయలుదేరి పులివెందులలోని ధ్యాన్చంద్ క్రీడా మైదానంలో దిగుతారు. రోడ్డు మార్గాన పులివెందుల సీఎస్ఐ చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్లో ఇడుపులపాయకు చేరుకుంటారు. తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి ఆశీర్వాదం పొంది ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. తిరిగి హెలికాప్టర్లోకడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు.