ముఖ్యనేతలతో వైయస్ జగన్ అత్యవసర భేటీ
హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా బీసీ రైతు కోటయ్య ప్రాణాలు కోల్పోవడం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న నాయకులతో వైయస్ జగన్ అత్యవసరంగా భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా కొండవీడులో బీసీ రైతు కోటయ్య మరణంపై ఈ సమావేశంలో చర్చించారు. ఏం జరిగిందన్నఅంశంపై నిజనిర్ధారణ కోసం శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఓ కమిటీని వైయస్ జగన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఎందుకింత దిగజారారు అంటూ వైయస్ జగన్ విమర్శించారు.
ఉద్యోగులను చంద్రబాబు మోసం చేస్తున్న తీరుపైనా చర్చించారు. చంద్రబాబు ప్రకటించిన ఐఆర్ (మధ్యంతర భృతి)లో నిజాయితీ ఉందా? లేదా? అన్నది ఉద్యోగులకు అర్థం అవుతుందన్న వైయస్ జగన్ ఇప్పుడు ప్రకటించి జూన్లో ఇస్తాం అనటం మోసం కాక మరేమిటన్న ధ్వజమెత్తారు. తనకు అధికారం లేని బడ్జెట్మీద చంద్రబాబు ఎలా నిర్ణయం తీసుకుంటారన్న జగన్ ..ఎన్నికలయ్యాక వచ్చే ప్రభుత్వమే కదా.. ఆ రోజు నిర్ణయం తీసుకోవాల్సింది?, మరి చంద్రబాబు ఎలా ప్రకటన చేస్తున్నారు? ఇది దగా కాదా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు ప్రకటించగానే ఇప్పటికిప్పుడే అమలు చేస్తున్నట్టుగా ఆయనకు సన్మానాలు చేయడం ఏమిటన్నారు. ప్రజలు, దేవుడు ఆశీర్వదించేది మన ప్రభుత్వాన్నే అన్న వైయస్ జగన్ ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు.