ఈనెల 17న గవర్నర్‌తో  వైయస్‌ జగన్‌ భేటీ

6 Dec, 2025 20:59 IST

తాడేపల్లి: రాష్ట్రంలో 10 కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్‌ శ్రీ అబ్ధుల్‌ నజీర్‌కు నివేదించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈనెల 17న ఆయనతో భేటీ కానున్నారు. ఆరోజు సా 4 గం.కు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి శ్రీ వైయస్‌ జగన్, గవర్నర్‌ గారిని కలవనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ స్పెషల్‌ సీఎస్‌ నుంచి వైయ‌స్ఆర్‌సీపీకి లేఖ అందింది.
    
కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌ గారికి నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌ గారికి చూపించనున్నారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు.