`అమూల్` లాభాల్లో మహిళలకు బోనస్
అమరావతి: అమూల్కు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు బోనస్ రూపంలో మహిళలకే ఇస్తుందని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ చేయూత, ఆసరా పథకాల ద్వారా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే అమూల్ కార్యకలాపాలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. నా పాదయాత్రలో పాడి రైతుల కష్టాలను నేను చూశాను. అధికారంలోకి వచ్చాక సహకార సొసైటీలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చాను. అమూల్ తో ఒప్పందం వల్ల పాడి రైతులకు మేలు జరుగుతుంది. మార్కెట్లో లో పోటీతత్వం ఉంటేనే రైతులకు ఎక్కువ మేలు జరుగుతుంది. ప్రపంచంలో అమూల్ సంస్థ 8వ స్థానంలో ఉంది.అమూల్ కు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండు సార్లు బోనస్ రూపంలో మహిళలకే ఇస్తుంది. తొలి దశలో 7 వేల యూనిట్ల పాడి పశువుల పంపిణీ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లక్ష యూనిట్లు, ఆగస్టులో 3 లక్షల యూనిట్ల పంపిణీ చేస్తాం . మహిళలకు శాశ్వత ఆదాయం ఉండేలా ఈ ప్రాజెక్టును చేపట్టాం .లీటరుకు రూ. 5 నుంచి 7 వరకు పాడి రైతులకు ఆదాయం కలుగుతుంది. పాలు సేకరించిన 10 రోజులలోపే పాడి రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. నేటి నుంచి చిత్తూరు జిల్లాలో పాల సేకరణ ప్రారంభం ...తొలిదశలో 400 కేంద్రాలలో పాల సేకరణ జరుగుతుంది. రాబోయే రోజులలో గ్రామాల స్వరూపాలు మారబోతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాలలో 6,551 కోట్లతో పాలసేకరణ , బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.