చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? 

3 Jul, 2025 10:52 IST

తాడేపల్లి: చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?.. విదేశాల్లో మెడికల్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు  చేయిస్తారా? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎన్‌ఎంసీ (NMC) గైడ్‌లైన్స్‌ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ (FMG) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసినా, ఎందుకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు?’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైయ‌స్‌ జగన్‌ నిలదీశారు. 
‘‘ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? గడచిన ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ, ఇంటర్న్‌షిప్‌ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు లాభం చేకూర్చేలా, ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పీఆర్‌) నంబర్‌ ఇవ్వకపోవడం వాస్తవం కాదా?


..తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాల‌కు పంపిస్తే, ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగాచూస్తూ, వారి కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్‌లో భాగం కాదా?’’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

‘‘డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా, ఇక్కడే, మన రాష్ట్రంలోనే, ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటి ద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే, చంద్రబాబూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే, వాటిని వద్దు అన్న ప్రభుత్వం, దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతికోసం స్కామ్‌లు చేస్తూ ఆ కాలేజీలను ప్రయివేటీకరించే కుట్ర చేస్తున్నారు’’ అని వైయ‌స్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.