ప్రముఖ కవయిత్రి ఇందిరాదేవి ధనరాజ్‌గిర్‌ మృతి పట్ల  వైయస్‌ జగన్‌ సంతాపం 

15 Jan, 2026 17:05 IST

తాడేప‌ల్లి: ప్రఖ్యాత హిందీ, ఆంగ్ల కవయిత్రి, ప్రసిద్ద కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారి సతీమణి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌ (96) మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. రిటర్న్‌ ఎటర్నిటీ, పోయెమ్స్‌ ఆఫ్‌ మై నేషనల్‌ మెమోరీ, విండ్‌ బ్లోస్‌ ఫ్రమ్‌ స్కా ఫోల్డ్‌ తదితర 12 పుస్తకాలు ఇందిరా దేవి రాశారు. తన కుటుంబ వారసత్వ చరిత్రను ‘‘మెమోరీస్‌ ఆఫ్‌ ది దక్కన్‌ ‘‘ పేరుతో కాఫీటేబుల్‌ బుక్‌ గా ప్రచురించారు. వరల్డ్‌ పోయెట్రీ సొసైటీ ఇంటర్‌ కాంటినెంటల్‌ సంస్థ 1973లో ఇందిరా దేవిని నోబెల్‌ సాహిత్య పురస్కారానికి నామినేట్‌ చేసింది. ఇలాంటి అరుదైన గౌరవం పొందిన తొలి భారతీయ కవయిత్రి ఇందిరాదేవి కావడం విశేషం. ఆమె రాసిన కొన్ని ఆంగ్ల కవితలను ప్రముఖ కవి ముగ్థుమ్‌ ఉర్థూ లోకి అనువదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీకి మొట్టమొదటి అధ్యక్షురాలిగా ఇందిరాదేవి బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె చిత్రకారిణి కూడా. ముంబైలో ఎం.ఎఫ్. హుస్సేన్ సారథ్యంలో ఇందిర గీసిన చిత్రాలతో 1970వ దశకంలో ప్రదర్శన నిర్వహించారు. శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి సతీమణిగా ఆయన సాహితీ యాత్రలో శ్రీమతి ఇందిరాదేవి గారి పాత్ర చిరస్మరణీయమైనది. శ్రీమతి ఇందిరా గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అని శ్రీ వైయస్‌ జగన్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు