లక్ష్మీనారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ పరామర్శ
తాడేపల్లి: పోలీసుల వేధింపులు.. తప్పుడు కేసుకు బలైపోయిన వైయస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి కుటుంబ సభ్యులను వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. తీవ్ర మానసిక వేదనకు గురైన రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి ఏకంగా విద్యుత్ సబ్స్టేషన్లో కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ద్వారా బాధిత కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో పరువు పోయిందని మానసిక వేదనతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య వైయస్ జగన్కు చెప్పారు. అరెస్టు సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులు తీవ్రంగా హింసించారని ఆయన దృష్టికి తెచ్చారు. పూలు అమ్ముకుని జీవించే నారాయణరెడ్డి అకాల మరణంతో భార్య, ఇద్దరి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని బంధువులు వైయస్ జగన్కు తెలిపారు. ఇందుకు స్పందించిన మాజీ సీఎం..అధైర్య పడవద్దని, పార్టీ తరఫున అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. నారాయణరెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకూ పార్టీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.