తాడేపల్లి: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాలమరణం పట్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పాటు పలు విదేశీ సంస్థలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ మధ్యనే ఢిల్లీలో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డితో కలిసి చర్చలు జరిపామని, ఇంతలోనే ఇటువంటి వార్త దిగ్భాంత్రికి గురిచేసిందంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన సంతాప సందేశంలో పేర్కొంది. వారం రోజుల క్రితమే రాష్ట్రంలో పెట్టుబడుల గురించి మంత్రి మేకపాటి సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని, ఆయన మరణించినా రాష్ట్రంలో పెట్టుబడుల సంబంధాన్ని కొనసాగించడం ద్వారా ఆయన ఆత్మకు శాంతిని చేకూరుస్తామని రీజెన్సీ గ్రూపు చైర్మన్ ఎస్బీ హాము హజీ పేర్కొన్నారు. దుబాయ్ పర్యటనలో మంత్రిగా మేకపాటి నిబద్ధత, నిరాడంబరత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని, వారం రోజు ల్లోనే ఇలాంటి వార్త హృదయాలను కలచివేసిందని షరాఫ్ గ్రూపు వైస్ చైర్మన్ షరాబుద్ధీన్ షరాఫ్ పేర్కొన్నారు. జీ42 గ్రూపు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దుబాయ్ చాప్టర్ మంత్రి మేకపాటి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశాయి.