పార్వతీపురం: వైయస్ఆర్ చేయూత పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు, సాధికారతకు దోహదపడుతోందని, వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో బహిరంగ సభ నుంచి వరుసగా మూడో ఏడాది వైయస్ఆర్ చేయూత సాయం మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. శనివారం అలజంగి జోగారావు అధ్యక్షతన పెద్ద యెత్తున సీఎం వైయస్ జగన్కు సీతానగరం మండలం మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. వరుసగా మూడవ ఏడాది కూడా 18,750 రూపాయల ఆర్థిక సహాయం అందచేసిన గౌ సీఎం వైయస్ జగన్ గారికి మహిళా లబ్ధిదారులు అంతా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భగా ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే ఈ సాయం మొత్తాన్ని ప్రతి ఒక్కరూ తమ వ్యాపారానికి పెట్టుబడిగా ఉపయోగించుకోవాలన్నారు. వారు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ముందుకు సాగేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించనుందన్నారు. మహిళా సాధికారత దిశగా సాగుతున్న ప్రభుత్వం.. అన్ని పథకాలకు మహిళలనే ప్రధాన అర్హులుగా గుర్తించారంటే.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మహిళలకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోందన్నారు. మీ నైపుణ్యంతో చేయగలిగిన ఏ పనైనా వ్యాపారంగా కొనసాగించి ముందుకు సాగవచ్చన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలను మహిళలు అందిపుచ్చుకుని ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.