రెండేళ్లలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే
తాడేపల్లి: రెండేళ్ల చంద్రబాబు కూటమి పాలనలో ఎక్కువగా నష్టపోయింది మహిళలేనని, దగా, మోసం, వెన్నుపోటుకి పరాకాష్టగా ఈ రెండేళ్ల కూటమి పాలన నిలిచిపోతుందని వైయస్ఆర్సీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పేరుతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య హాజరై ప్రసగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నవి ఊడపీకేసి.. నిలువుదోపిడీ చేసేసి, మహిళలకు పెద్దపీట వేశాను, 33 శాతం రిజర్వేషన్ తెస్తామని మహానాడులో డబ్బా కొట్టుకున్నాడని చెప్పారు. చీకటి సామ్రాజ్యాధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు చూపిస్తున్నాడని ధ్వజమెత్తారు. "చంద్రబాబే ఓ గోబెల్స్ బాస్. ఇతరుల్ని ఎస్కో బార్ అంటాడు, ఆయనే పెద్ద ఎస్కో బార్. ఓ నక్క, హైనా, తోడేలు ఆలోచనలు కలిస్తే చంద్రబాబు. లక్ష రాక్షసుల ఆలోచనలు కలిస్తే చంద్రబాబు." అలాంటి వ్యక్తిని రాజకీయంగా నాశనం చేయగలిగిన శక్తి జగన్ గారికే ఉంది. చంద్రబాబు పాలిట గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఆయనే అన్నారు. మహిళా విభాగం ద్వారా ఈ రెండేళ్లలో జరిగిన అరాచకం, దోపిడీ, దగాను రాష్ట్ర మహిళలకు గుర్తుచేసి, వాస్తవాలను గణాంకాలతో సహా వివరించడంతోపాటు మేమున్నామనే భరోసా ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తానంటున్న లోకేష్ కి చిత్తశుద్ది ఉంటే ఇప్పుడు రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లలో ఇవ్వొచ్చు కదా అని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైయస్ఆర్సీపీ మహిళా నాయకులు పాల్గొని ప్రసంగించారు.
వారు ఇంకా ఏం మాట్లాడారంటే..
వైఫల్యాలను ప్రశ్నిస్తే పెంపుడు గొంతుకలతో ఎదురుదాడి
- సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ సమన్వయకర్త
రెండేళ్ల పాటు సాగిన వ్యవస్దీకృత అరాచక పాలనను ఎత్తిచూపుతూ, రెండేళ్లకు ముందు సాగిన దేశంలోనే ఆదర్శమైన పాలనను గుర్తుచేసుకుంటూ, ప్రజలకు గుర్తుచేస్తూ పది రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో అందరి కంటే ఎక్కువగా నష్టపోయింది, దోపిడీకి గురైంది మహిళలే. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం వారికే ఉంది. ఏ పాలనకైనా మహిళలకు పెద్ద పీట వేయడమే గీటురాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలన అలాగే సాగింది. చెప్పినవన్నీ చేసేశానని ఈ ప్రభుత్వం చెప్పుకోవడం దోపిడీ, దగా, మోసానికి పరాకాష్ట. ఉన్నవి ఊడపీకేసి నిలువుదోపిడీ చేసేసి, మహిళలకు పెద్దపీట వేశాను, 33 శాతం రిజర్వేషన్ తెస్తామని మహానాడులో డబ్బా కొట్టుకున్నారు. ఇంకా బరితెగించి స్త్రీశక్తి 33 శాతం చేస్తారట, గతంలో 50 శాతం రిజర్వేషన్లను చట్టం కూడా చేసి ఇస్తే దిక్కులేదు. ఆ చట్టం ఏమైందో ఎవరికీ తెలియదు. దాని ఊసేలేదు. ఆ బరితెగింపుకు ఏ పేరు పెట్టాలో తెలియడం లేదు. మనం ప్రశ్నించినా మనది ఏకాకి గొంతులా బయటికి రాకుండా ఉండిపోతోంది. కానీ తాను తయారు చేసుకున్న 10 వేల పెంపుడు గొంతుకలతో ఎదురుదాడి చేయిస్తారు. మహిళలు సొంతకాళ్ల మీద నిలబడేలా ఎన్నిదారులు సృష్టించాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే, ఇప్పుడు చంద్రబాబుకు ఆ పని లేకుండా పోతోంది. చంద్రబాబు తాను సీఎం కావడం మీ భాగ్యం, పోకుండా ఉండటం మీ అవసరం అన్నట్లుగా పూజలు చేయించుకుంటే ఆయన పరిస్ధితి అర్దమవుతోంది. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన తల్లికి అన్నం పెట్టనోడు సామెతను విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్వయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఉచిత విద్యుత్ విషయంలోనూ మాట తప్పని మడమ తిప్పని చంద్రబాబు అంటూ భువనేశ్వరి కూడా వైఎస్సార్ మాటల్ని తన భర్తకు అన్వయించుకుంటున్నారు.
సౌత్-నార్త్ జనాభా తేడాలకూ, పిల్లల్ని కనడానికి సంబంధం ఏంటి ?
వైయస్ జగన్ గారైనా, అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారైనా అధికారం కోసం ఏనాడూ తప్పుడు హామీలు ఇవ్వలేదు. పేదల గుండెల్లో చిరస్ధాయిలా నిలిచేలా ఏ పథకానికి అయినా రూపకల్పన చేశారు. ఈ రోజు ఇంతమంది మహిళలు ప్రతీ చోటా ఉత్సాహంగా కదులుతున్నారంటే.. ఇదంతా నాయకుడిని బట్టే జరుగుతోంది. ఎన్నికలకు ముందు చెప్పిన విషయాలకు పూర్తి విరుద్దంగా ఉండటం చంద్రబాబు నైజం. ఇప్పుడు ఆ స్టేజ్ కూడా దాటిపోయి నేను అంతా పూర్తి చేసేశాను, ఎంజాయ్ చేసుకోండి అంటున్నాడు. ఎన్నికలకు ముందు సంపద సృష్టించి మీకు ఇస్తా అన్నాడు, ఇప్పుడు పిల్లలే సంపద అంటున్నాడు. ఆయన జోకర్ అని కూడా నేను అనుకోను. కావాలనే అన్నీ చేస్తాడు. చంద్రబాబు మోసం చేశాడంటే.. మోసం కాక ఏం చేస్తాడు, బద్దం కాకుండా ఏం మాట్లాడతాడు అన్నట్లుగా పరిస్ధితుల్ని మార్చేస్తున్నారు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా సంపద ఇచ్చేశాను కాబట్టి, ఇప్పుడు పిల్లలే సంపద అంటున్నాడు. అదే మాట కొడుకు లోకేష్ కు మాత్రం చెప్పడు. సౌత్-నార్త్ జనాభా తేడాలకూ, పిల్లల్ని కనడానికి సంబంధం ఏంటి ? ఉచిత విద్య, వైద్యం పీకేసి, ఇప్పుడు పిల్లల్ని కంటే వారికి అవన్నీ ఎవరు అందిస్తారు ? నెలకు 15 వేలు ఏమైందో తెలియదు, ఆడబిడ్డ నిధి ఏమైందో కూడా తెలియదు. ఈ డిబేట్లు జరుగుతుండగానే మళ్లీ ఎన్నికలు వస్తాయి, అప్పుడు మళ్లీ కొత్త హామీలు తీసుకొచ్చి దాటేయాలనుకుంటాడు. ఈసారి లక్షా, రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి, అందులో సగం ఎన్నికలకు వాడుకుంటాడు. కింది స్ధాయిలో సహజవనరులు కొట్టేస్తే ఈ ఎన్నికల్ని దాటేయొచ్చని అనుకుంటున్నారు. గల్ఫ్ లో, ఇతర దేశాల్లో వాళ్ల మాఫియాలు ఉంటారు. ఆ చీకటి సామ్రాజ్యాధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు చూపిస్తున్నారు.
నక్క, హైనా, తోడేలు ఆలోచనలు కలిస్తే చంద్రబాబు
చంద్రబాబు ఓ గోబెల్స్ బాస్. ఇతరుల్ని ఎస్కో బార్ అంటాడు, ఆయనే పెద్ద ఎస్కో బార్. ఓ నక్క, హైనా, తోడేలు ఆలోచనలు కలిస్తే చంద్రబాబు. లక్ష రాక్షసుల ఆలోచనలు కలిస్తే చంద్రబాబు. అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. ఈ పరిస్ధితుల్లో మనం క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. రెండేళ్లలో ఎంత చెత్త ప్రభుత్వమైనా కనీసం ఇవన్నీ చేశామని చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ అలా చెప్పుకునే పరిస్ధితి కూడా లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకునేలా కనిపిస్తోందా ? కనీసం వాళ్ల మీడియాలో అయినా కనిపిస్తోందా ? రాష్ట్రంలో ఎక్కడ చూసినా యంత్రాలు పెట్టి ఇసుక అక్రమ మైనింగ్ . ఇది ఎవరి కన్నుసన్నల్లో జరుగుతుందో అందరికీ తెలుసు. డీఎస్సీ అక్రమాల విషయంలో మాత్రం ఆ పేపర్లలో, మీడియాలో ఒక్క వార్తా కనిపించదు. ఎంతసేపూ గొడ్డలి, పలుగు, రాజారెడ్డి కుటుంబ వార్తలే. చంద్రబాబుకు జగన్ నిజంగానే గొడ్డలి లాగే కనిపిస్తాడు. రాజకీయంగా తన ప్రాణం తీయగలిగిన శక్తి, తన లాంటి శక్తుల్ని శాశ్వతంగా సమాధి చేయగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు స్నేహితులా ఎలా కనిపిస్తారు? చంద్రబాబు పాలిట గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు వల్ల మహిళా లోకమే ఎక్కువగా నష్టపోయింది. ఒక్క డ్వాక్రా మహిళలే కోటి మంది. 2014కు ముందు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చంద్రబాబు మోసం చేసిన నేపథ్యంలో తాము అధికారంలోకి రాగానే 16 వేల కోట్లు వెనక్కి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు 2017 ప్లీనరీలో హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటే రూ. 16 వేల కోట్లు ఇస్తే సరిపోతుంది, కానీ ఆయన ఎన్నికల సమయానికి ఉన్న 25 వేల కోట్లు ఇచ్చారు. సున్నా వడ్డీ కూడా 5 వేల కోట్లు ఇచ్చారు. ఇప్పుడు దానికీ దిక్కులేదు. లక్ష ఇస్తాను పారిశ్రామిక వేత్తల్ని తయారు చేసుకోండని చంద్రబాబు చెప్తాడు, లక్ష రూపాయలతో ఎవరైనా పారిశ్రామిక వేత్తలు అవుతారా ? చంద్రబాబు హయాంలో 18 శాతం పైగా నిరర్ధక ఆస్తులు ఉంటే.. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 0.45 శాతానికి అవి తగ్గిపోయాయి. వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లు మహిళలు లక్షా 70 వేల కోట్లకు పైగా డ్వాక్రా రుణాలు తీసుకున్నారు. ఇది దేశంలోనే రికార్డు. గతేడాది అది గతేడాదికి 40 వేల కోట్లు, ఈ ఏడాదికి రూ.30 వేల కోట్లకు తగ్గిపోయింది. ఈ రెండేళ్లలో జరిగిన అరాచకం, దోపిడీ, దగాను మహిళలకు గుర్తుచేయాలి, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మూడేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలకు వాస్తవాలు గణాంకాలతో సహా వివరించి వారికి మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలి. తద్వారా వారిని కూటమి ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చైతన్యం తీసుకురావాలి.
చిత్తశుద్ధి ఉంటే మహిళలకు రాజ్యసభ సీటు ఇవ్వొచ్చు కదా
- వరుదు కల్యాణి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు
టీడీపీ నేతలు సూపర్ సిక్స్ గురించి అడిగితే చంద్రబాబు సూపర్ సిక్స్-సూపర్ హిట్ అంటున్నారు. ఈ మాటలు వింటుంటే ఈ మధ్య నెల్లూరు వెళ్లినప్పుడు స్టవ్ వెలిగించకుండా చేపల పులుసు వండినట్లే ఉంటుంది. సూపర్ సిక్స్ లో మొదటి హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాల్సిన బాధ్యత పార్టీ మహిళా విభాగంపై ఉంది. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తామని రాజమండ్రిలో జరిగిన మహానాడులో హామీ ఇచ్చి, ఎన్నికలు జరిగి రెండేళ్లయినా ఇప్పటికీ ఇవ్వలేదు. కూటమి పాలనలో అభివృద్ధి లేదు, జీడీపీ లేదు, నేరాలు మాత్రం పెరుగుతున్నాయి. లోకేష్ ఇప్పుడు చంద్రబాబు కంటే ఘోరంగా అబద్దాలు చెప్తున్నారు. ఈ రెండేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండానే ప్రజల్ని మభ్యపెడుతున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తానంటున్న లోకేష్.. ఆయనకు చిత్తశుద్ది ఉంటే ఇప్పుడు ఇస్తున్న రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లలో ఇవ్వొచ్చు కదా. కేంద్రం ఎలాగో ఇస్తున్న రిజర్వేషన్ల క్రెడిట్ కొట్టేయాలన్న ఆలోచన తప్ప ఏమీ లేదు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటున్న లోకేష్.. ఒకే ఒక్క నోటిఫికేషన్ తో లక్షా 30 ఉద్యోగాలు భర్తీ చేసిన ముఖ్యమంత్రి జగన్ అని గుర్తుపెట్టుకోవాలి. కూటమి రెండేళ్ల పాలనలో 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు. కాబట్టి ఆయన చెప్పిన బోత్ ఆర్ నాట్ సేమ్ నిజమే. మహిళల కోసం ఎంతో పాటుపడిన జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుపై అన్ని స్ధాయిలో మహిళలకు పూర్తి స్దాయిలో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
ఎడారి - ఒంటె కథలో ఒంటె లాంటివాడు చంద్రబాబు
- నందమూరి లక్ష్మీపార్వతి, వైయస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ
రాష్ట్రంలో చంద్రబాబు మొదటి మహిళా బాధితురాలిని నేనే. ఆనాడు బ్రిటీష్ నిరంకుశ విధానాలనే ఈనాడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అవలంభిస్తోంది. తప ఐదేళ్ల పాలనలో ప్రతి కుటుంబానికి వైయస్ జగన్ అండగా నిలిచి ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం మహిళలను రోడ్డున పడేసింది. వైయస్ఆర్సీపీ హయాంలో మహిళలకు రక్షణ నిలిచిన దిశ యాప్ను కూడా చంద్రబాబు నిర్వీర్యం చేసేశాడు. ఎడారి - ఒంటె కథలో ఒంటె లాంటివాడు ఈ చంద్రబాబు. అవసరమైతే జుట్టు అవసరం లేనప్పుడు కాళ్లు పట్టుకునే నీచమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు. ప్రమాణం చేసి మరీ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న నీచుడు చంద్రబాబు. ఎన్టీఆర్ నాశనం కావాలని క్షుద్ర పూజలు కూడా చేయించాడు. రెండెకరాల నుంచి రూ. 6 లక్షల కోట్లు ఎలా సంపాదించాడో ఆలోచిస్తే చంద్రబాబు ఎలాంటి వాడో అర్థమైపోతుంది. చంద్రబాబు దుర్మార్గాలను మహిళలే ప్రజల్లోకి తీసుకెళ్లాలి. చంద్రబాబుని మించిన దుర్మార్గుడు లోకేష్. ఐటీడీపీ ద్వారా మహిళలను కించపరిచడమే పనిగా పెట్టుకున్నారు.
మహిళలని కూడా చూడకుండా కేసులతో వేధిస్తున్నారు
- విడదల రజని, మాజీ మంత్రి
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడులు నిత్యకృత్యమైపోయాయి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను ఎత్తిచూపితే అక్రమ కేసులతో వేధిస్తున్నారు. వైయస్ జగన్కి సానుభూతి పరులైతే చాలు వేధింపులు షరామామూలై పోయాయి. ఆయన పేరెత్తితే ఈ ప్రభుత్వం భయంతో వణికిపోతోంది. మహిళా నాయకులు పార్టీ కార్యక్రమాలకు వెళ్లాలన్నా పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకాలు చేసి రావాల్సిన దుస్థితి కల్పించారు. ఇలాంటి చంద్రబాబు మహిళా బిల్లుని తీసుకొస్తామంటే ఎవరూ నమ్మరు. వైయస్ జగన్ గారు మన వెంట ఉన్నంతకాలం భయపడాల్సిన పనిలేదు. రెండేళ్లుగా మహిళలను మోసం చేస్తున్న చంద్రబాబుకి పతనం మొదలైంది. 44 మందికి ఎమ్మెల్యేలుగా వైయస్ జగన్ గారు అవకాశం కల్పించి మహిళా పక్షపాతిగా నిలిచారు. జగన్ గారు మా లీడర్ అని చెప్పుకోవాలంటే గర్వంగా ఉంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో టీడీపీ మోసం
- తనూజరాణి, ఎంపీ
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా 2023లోనే వైయస్ జగన్ గారు అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపారు. అంతేకాకుండా 2019-24 మధ్య మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపించారు. కానీ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు తెలుగుదేశం పార్టీ 33 శాతం రిజర్వేషన్ ఇస్తుందని నారా లోకేష్ చెప్పడం హాస్యాస్పదం. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా సభలో ఎన్డీఏ పక్షాన బిల్లుకి మద్ధతుగా ఉన్నట్టు నటించారు. కానీ సాయంత్రానికి కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి గూటికి చేరిపోయారు. ఇదీ తెలుగుదేశం పార్టీకి మహిళా రిజర్వేషన్ పట్ల ఉన్న చిత్తశుద్ధి. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నచంద్రబాబు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఎందుకు కల్పించలేదు? కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని మాట్లాడిన చంద్రబాబుకి మహిళలంటే ఎంత గౌరవమో ఆనాడే చెప్పకనే చెప్పారు.
గిరిజన మహిళలకు వైయస్ జగన్ పెద్దపీట వేశారు
- భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రజలు నిలదీస్తారనే భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో తిరగలేకపోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి 2014-19 మధ్ సీఎంగా ఉన్న చంద్రబాబు జీవో నెంబర్ 97 తీసుకొస్తే వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని రద్దు చేశారు. వంద శాతం స్థానిక గిరిజనులకే ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఉన్న జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నచంద్రబాబు దానికి వైయస్ జగనే కారణమంటూ తప్పుడు ప్రచారం చేశాడు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే జీవో నెంబర్ 3ని పునరుద్ధరించడం లేదా ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తానని చెప్పిన చంద్రబాబు గిరిజనులను తీవ్రంగా వంచించాడు. గిరిజనుల అనారోగ్య పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపించడానికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు వైయస్ జగన్ గారు. సికిల్ సెల్ ఎనీమీయాతో బాధపడుతున్న గిరిజనులకు నెలనెలా రూ. 10 వేల పింఛన్ అందజేసి ఆదుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ పంపిణీకి వైయస్ జగన్ గారు తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలను చంద్రబాబు రద్దు చేశాడు. గిరిజనులకు ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. పోడు వ్యవసాయం చేసుకునే 4.60 లక్షల మంది రైతులకు 2.30 లక్షల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందజేసి చరిత్రలో నిలిచిపోయే సాయం చేశారు. రాజకీయంగా ప్రోత్సహించడానికి గిరిజన మహిళలకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి గౌరవించారు. మహిళలను ఇంతగా గౌరవించి ప్రోత్సహించిన వైయస్ జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి.
అబద్ధాల నేర్పే వర్క్ షాప్గా మహానాడు
- ఉప్పాల హారిక, కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్
తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు చూస్తే అబద్ధాలు ఎలా మాట్లాడాలో వర్క్షాప్ నిర్వహించినట్టుగా ఉంది. వైయస్ జగన్ గారిని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిందించడానికే సభ పెట్టుకున్నారు. దానికి మహానాడు బదులు జగన్ నాడు అని పెట్టుకోవాల్సింది. పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. హోంమంత్రి అనిత ఒక మహిళ అయ్యుండీ మహిళలకు జరిగే దారుణాలపై కాకుండా వైయస్ జగన్ కుటుంబాన్ని విమర్శించడానికే మైకులు తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పార్టీ అని పెట్టుకోవడం ఉత్తమం. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి చూపించాలి. పథకాలు పేర్లు మార్చడం తప్ప చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చింది లేదు. జనరల్ స్థానంలో నాకు జెడ్పీ చైర్పర్సన్గా వైయస్ జగన్ గారు అవకాశం కల్పించారు. పోలీసుల సమక్షంలో టీడీపీ గూండాలు నాపై దాడి చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా బాధితులమైన నాభర్తపైనే తప్పుడు కేసు పెట్టారు. రాష్ట్రమంతా ఇదే విధంగా రాక్షస పాలన పరిస్ధితి కనిపిస్తోంది. వైయస్ జగన్ గారిని తిట్టినంత మాత్రాన మీ వైఫల్యాల గురించి ప్రజలు గమనించరు అనుకుంటే అంతకన్నా అవివేకం ఉండదు.
అబద్ధాల పాలనకు చరమగీతం పాడాలి
- సుభద్ర, విశాఖ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్, మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్
వెన్నుపోటు అనే పదం వినిపిస్తే చంద్రబాబే గుర్తుకొస్తాడు. చంద్రబాబు దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, కింది స్థాయి లీడర్ల వరకు కూటమి నాయకులంతా కలిసి ఇప్పటికీ పచ్చి అబధ్దాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. రెండేళ్ల చంద్రబాబు వెన్నుపోటు గురించి ఇంటింటికీ తీసుకెళ్లాలి. ఆయన చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దీంతోపాటు వైయస్ జగన్ గారి పాలనలో అందించిన సంక్షేమ పథకాల గురించి మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మహిళలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడకుండా మహిళా హోంమంత్రి అనిత వైయస్ జగన్ గారిని తిట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
కేసులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
- ఆరె శ్యామల, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి
సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, లోకేష్లు మహిళలపై మాటల్లో చెప్పుకోలేని విధంగా నీచమైన పోస్టులు పెట్టించి అవమానిస్తున్నారు. జగనన్న ఇచ్చిన ధైర్యంతో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మహిళలకు అన్యాయం జరిగిన రోజే అది వారికి ఆఖరి రోజు అవుతుందన్న మాట నిజం చేశారా? పిఠాపురం పీఠాధిపతి చెప్పిన తలలు తీసేసే చట్టం ఎప్పుడు తెస్తారు? స్వేచ్ఛగా మాట్లాడగలిగే స్వేచ్ఛ మహిళలకు లేదా? మహిళలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలతో వేధించడం న్యాయమా? వైయస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు తలచుకుంటే టీడీపీ ఆఫీసు కూడా ఉండదు. జగనన్న మాకు అండగా ఉంటే ఎన్ని వేధింపులైనా భరిస్తాం. తగ్గేదే లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం ఆపేది లేదు. మహిళలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత. జగన్ గారిని రాజును చేసి కూర్చోబెట్టే బాధ్యత మన మహిళలదే.
ప్రాణం విలువ తెలిసిన నాయకుడు జగనన్న
- సత్యవతి, మాజీ ఎంపీ
నాకు ఎంపీగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి కృతజ్ఞతలు. మనిషి ప్రాణం విలువ తెలిసిన నాయకుడు జగన్ గారు. అందుకే ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అందరికీ ప్రాణదాతగా నిలిచిన జగనన్న మళ్లీ సీఎంగా రావాలి. మహిళమంతా కలిసి రాబోయే ఎన్నికల్లో భూకంపం సృష్టిద్దాం.
అబద్ధాలు, మోసాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్
- నూరి ఫాతిమా, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త
అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటుకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ఇచ్చిన మాట తప్పని నాయకుడు వైయస్ జగన్ గారు. నమ్మకానికి, నిజాయితీకి ఆయన మారు పేరు. ఎక్కడ చూసినా చంద్రబాబు చేసిన మోసాల గురించే మాట్లాడుతున్నారు. రెండేళ్లలో ఏం చేశామోచెప్పుకోలేక మహానాడులో చంద్రబాబు, లోకేష్ భజన ఎక్కువైంది. మహిళలపై దాడులు జరుగుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
చేయని పనులు చేశామని చెప్పుకోడానికే మహానాడు పెట్టారు
- కాకాణి పూజిత, జోన్ 4 వర్కింగ్ ప్రెసిడెంట్
ఆశాలు, అంగన్వాడీలకు జీతాలు పెంచామని చెప్పడం, దిశ యాప్ తెచ్చామని చెప్పుకోవడం లాంటి వైయస్ జగన్ గారు చేసిన మంచి పనులు కూడా మేమే చేశామని మహానాడులో చాలా కాన్ఫిడెంట్గా చెప్పుకున్నారు. చేయని పనులు చేశామని చెప్పుకోవడం కోసమే మహానాడు పెట్టుకుంటారనిపిస్తుంది. వైయస్ జగన్ గారి పేరు చెప్పకుండా వారికి రోజు గడవడం లేదు. ఎమ్మెల్యేలే కీచకులుగా మారి మహిళలపై దాడులు చేసి వేధిస్తున్నా వారిని ఏమీ అనడం లేదు. కోనేటి ఆదిమూలం, కూన రవికుమార్, అరవ శ్రీధర్ మహిళలపై చేసిన వేధింపులకు కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. బీఆర్ నాయుడి లైంగిక వేధింపుల గురించి మొరపెట్టుకున్నా వినకుండా ఆయన్ను టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చిన ఘనుడు చంద్రబాబు మహిళలకు ఎంత రక్షణ కల్పిస్తాడో చెప్పకనే చెప్పాడు. ఈ ప్రభుత్వంలో మహిళల మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. వైయస్ జగన్ గారి హయాంలో మహిళలకు ఇలాగే జరిగి ఉంటే నిందితులకు కఠిన శిక్షలు పడేవి. నిందితులను వదిలేసి బాధితులను వేధిస్తున్న దుర్మార్గ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మహిళలు గట్టిగా బుద్ధి చెబుతారు.
ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అని ప్రజలు అనుకుంటున్నారు
- అనూరాధ, జోన్-1 వర్కింగ్ ప్రెసిడెంట్
గత ఐదేళ్ల వైయస్ జగన్ పాలనలో మహిళలు సంక్షేమ పాలన చూస్తే, ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా అరాచకాలు, అఘాయిత్యాలు అనుభవిస్తున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఫొటోలు, సంతకాలతో బాండ్లు ఇచ్చి మరీ మోసగించారు. నాడు ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అనే స్లోగన్తో ప్రజల దగ్గరకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు, రెండేళ్ల పాలనతో ప్రజలతో అదే మాట అనిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కువగా నష్టపోయింది మహిళలే. చంద్రబాబు ఇస్తామన్న సూపర్ సిక్స్ అమలు కాకపోగా జగనన్న ఇచ్చిన పథకాలన్నీ ఆగిపోయాయి. తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చి ప్రజల సంపదను దోచుకుంటున్నారు. చంద్రబాబు పుట్టిన తర్వాతే మోసం పుట్టిందని అనిపిస్తుంది.
అబద్ధాల పునాదుల మీదనే చంద్రబాబు రాజకీయం
అనూరాధ, జోన్ -2 వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ
అబద్ధాల పునాదుల మీదనే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు. రెండేళ్ల పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగంతో మహిళలను తీవ్రంగా వంచించాడు. వైయస్ జగన్ గారి పాలనకు ఏ విధంగానూ చంద్రబాబు సరితూగలేడు. వైయస్ జగన్ గారి పాలనలో మహిళలకు చేసిన మేలు గురించి ఇంటింటికీ వెళ్లి గుర్తు చేయాలి.
నలుగురేసి పిల్లల్ని కంటామని టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో డిక్లరేషన్ ఇప్పించాలి
- రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మాజీ మేయర్
మహిళలకు మాయమాటలు చెప్పి ఓటేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే మహిళలను తీవ్రంగా వంచనకు గురిచేసింది. వైయస్ఆర్సీపీ హయాంలో వైయస్ జగన్ గారు మహిళలకు అందజేసిన సంక్షేమ పథకాలు లేకుండా చేయడంతోపాటు చంద్రబాబు కొత్తగా ఇస్తానన్న వాటికీ దిక్కులేకుండా పోయింది. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా మహిళలకు వైయస్ జగన్ గారు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కానీ 40 ఏళ్ల విజనరీనని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ముగ్గురు నలుగురు పిల్లల్ని కనాలని చెప్పే చంద్రబాబు తన ఇంటి నుంచీ, తన పార్టీ నుంచే మొదలు పెట్టాలి. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ముగ్గురు, నలుగురు పిల్లల్ని కంటామని డిక్లరేషన్ ఇప్పించాలి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి కోటిన్నర సభ్యత్వం ఉందని చెబుతున్న చంద్రబాబు ఆ పార్టీ కార్యకర్తలతో కూడా నలుగురేసి పిల్లల్ని కనిపించాలి. ఆ తర్వాతే ప్రజలకు ఉచిత సందేశాలు ఇస్తే బాగుంటుంది.