కర్నూలు: కార్పొరేట్ సంపన్నులకు ఊడిగం చేసే విధానాల మార్పుతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ డీ.నాగన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం ఆత్మకూరు పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కాలేజీలో వైయస్ఆర్ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో వై ఏపీ నీడ్స్ ఛేంజ్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగన్న మాట్లాడుతూ దేశంలో కేవలం 9 మంది కుబేరుల సంపద 60 కోట్ల మంది ప్రజల ఆస్తితో సమానం కావడం విస్మయం కలిగిస్తుందన్నారు. 119 మంది కార్పొరేట్ కంపెనీల అధిపతుల ఆదాయం రోజుకు రూ.2,100 లక్షలుంది.
మరోవైపు రూ. 300 ఆర్జించే పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పడిపోతోంది. ఇలాంటి విధానాలు మారితేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాలు ప్రైవేటు రంగంలో తొలగించి ప్రభుత్వరంగంలో కొనసాగిస్తేనే పేద, మధ్య తరగతి ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. ఆయా రంగాలకు బడ్జెట్లో ఇతోధికంగా నిధులు కేటాయించి క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని నాగన్న అభిప్రాయపడ్డారు. సగటు ప్రజల ఆదాయం పెరిగితే అది తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని తెలిపారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరముందని నం వైయస్ఆర్ విద్యార్ది విభాగం నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి అన్నారు. దారుణంగా ప్రబలిన నిరుద్యోగ సమస్యను స్థానిక వనరుల వినియోగంతోనే పరిష్కరించాలని సూచించారు. ప్రధానమైన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఊతమివ్వాలని కోరారు. వైయస్ జగన్ సీఎం అయితే ఉద్యోగాల విప్లవం వస్తుందని తెలిపారు.
వైయస్ జగన్ సీఎం అయ్యాక గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి స్థానికంగా అదే గ్రామంలోనే 10 మందికి ఉద్యోగాలు ఇస్తారని తెలిపారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందేలా కృషి చేస్తారని వివరించారు.