తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి వైయస్ఆర్ పింఛన్ కానుక పంపిణీ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 63 లక్షల మందికి పైగా అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల వృత్తిదారులకు పింఛన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,747.38 కోట్లను విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ ప్రాంతంలోని లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా పింఛన్ డబ్బును ప్రభుత్వం.. ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో శనివారమే జమ చేసింది. సోమవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. అర్హులందరికీ పింఛన్లు అందజేస్తున్నామని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు.