తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయి ఏడాది దాటినా ఆయనలో మార్పు రాలేదని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అప్పట్లో తహసీల్దార్ వనజాక్షిపై అమానుషంగా దాడిచేసిన చింతమనేని ప్రభాకర్ ను వెనకేసుకొచ్చాడు. ఇప్పుడు 150 కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కామ్ సూత్రధారి అచ్చెన్నాయుడు, హంతకుడు కొల్లు రవీంద్రకు ధైర్యం చెబుతున్నాడు అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
విశాఖను విచ్ఛినం చేశారు
చంద్రబాబు అధికారంలో ఉండగా విశాఖను విచ్ఛిన్నం చేశారని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ లో ఆరోపించారు. "విశాఖకు బీచ్ తెచ్చానని చెప్పుకుంటాడు. సబ్ మేరిన్ కూడా తన ఘనతేనని తన వారితో చెప్పించుకుంటాడు. అలాంటి వ్యక్తి విశాఖ జిల్లాలో నిర్వాసితులకు తన 14ఏళ్ల పాలనలో కనీసం పరిహారం ఇవ్వలేదు. పేదలను పరిహసించాడు. జిల్లా నుంచి వచ్చిన ఆదాయంలో నాలుగోవంతు కూడా తిరిగి ఇక్కడ ఖర్చు చేయలేదు. జిల్లాలో మత్స్యకారులు, కాపులతో ఆటలాడుకున్నాడు. కుటీర పరిశ్రమలను కాలదన్ని... కార్పొరేట్ రంగానికి కొమ్ముకాస్తూ... పేదల పొట్టకొట్టాడు. ఆంధ్రా యూనివర్సిటీలో తన 14 ఏళ్ల పాలనలో కనీసం ఒక్క టీచింగ్ అసిస్టెంట్ పోస్టును కూడా భర్తీ చేయలేదు" అని విమర్శలు గుప్పించారు.