న్యూఢిల్లీ: కోవిడ్ ప్రభావం కారణంగా విశాఖపట్నం పోర్టుతో సహా ఆంధ్రప్రదేశ్లోని ఇతర పోర్టులలో కార్గో హ్యాండ్లింగ్ పరిణామం తగ్గిందని పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవల్ రాజ్యసభలో తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. అంతర్జాతీయంగా ఎగుమతులు, దిగుమతులపై కోవిడ్ మహమ్మారి ప్రభావం పడిందని, ఫలితంగా 2020-21లో ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ మేజర్ పోర్టుతోపాటు గంగవరం పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులలో సైతం కార్గో హ్యాండ్లింగ్ వాటి పూర్తి సామర్ధ్యాని కంటే చాలా తక్కువగా జరిగిందని తెలిపారు.
విశాఖపట్నం మేజర్ పోర్టు తమ మంత్రిత్వ శాఖ అధీనంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా పీపీపీ పద్దతిలో ఏర్పాటైన గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలోని మారిటైమ్ బోర్డు కింద పనిచేస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. విశాఖపట్నంతో సహా తమ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న అన్ని మేజర్ పోర్టులలో బెర్తులు, టెర్మినల్స్ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం పోర్టులోని ఐదు బెర్తుల్లో పీపీపీ పద్దతిపై కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ పోర్టులో కార్గో హ్యాండ్లింగ్కు సంబంధించి అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
నాన్ మేజర్ పోర్టులు సైతం వాటి సామర్ధ్యానికంటే తక్కువగానే కార్గో హ్యాండ్లింగ్ నిర్వహించాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ మోడల్పై రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నంతో పాటు కాకినాడలో కేఎస్ఈజెడ్ పోర్టును నాన్ మేజర్ పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.