విజయవాడ: టీటీడీ ఆధ్వర్యంలో 500 దేవాలయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారని, త్వరలోనే ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. గోమాత విశిష్టత తెలిపేందుకు గుడికో గోమాత కార్యక్రమం చేపడుతున్నామన్నారు. గోమాతలను దానం చేసేందుకు భక్తులు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు.సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు త్వరలోనే కల్యాణమస్తు కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. పేద జంటలకు తాళిబొట్టు, వస్త్రాలు ఇచ్చి వివాహాలు జరిపిస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.