కేంద్రం నిర్థారిస్తే.. అందరికి ఆనందయ్య మందు
తిరుపతి: ప్రజల మేలు కోసం కేంద్రం ఆనందయ్య మందును నిర్థారణ చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఈ మందు అందిస్తుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా నియంత్రణలో ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై టీటీడీ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఆనందయ్య మందుపై ప్రజల్లో మంచి స్పందన ఉంది. దీనిపై ఆయుష్ నుంచి నివేదిక రావాలి. ఆయుష్ నుంచి టీటీడీ అధ్వర్యంలోని ఆయుర్వేద కాలేజీకి నివేదిక పంపారని సుబ్బారెడ్డి తెలిపారు.
క్లినికల్ ట్రయల్స్ అంశంలో మినిస్ట్రీ ఆష్ ఆయుష్ నిర్ణయం తీసుకోనుంది. మందును ఆయుర్వేద కాలేజీలో తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారని తెలిపారు. 500 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ నివేదిక రావడానికి వారం పడుతుందని, ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్రానికి, రాష్ట్రానికి పంపామని తెలిపారు. టీటీడీ తరఫున మందును ప్రజలకు అందిచమని, సీఎం ఆదేశిస్తే అందుకు మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.