ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో భారీ అవినీతి
తాడేపల్లి: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ను అడ్డం పెట్టుకుని జరుగుతున్న అవినీతి సొమ్ము పంపకాల్లో కూటమి పార్టీల మధ్య తేడాలు రావడం వల్లే అసెంబ్లీలో ఈ వ్యవహారంను టీడీపీ ప్రశ్నించిందని, చిత్తశుద్ది ఉంటే ఈ అవినీతిపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించాలని వైయస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా పనిచేస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య పెద్ద ఎత్తున పరిశ్రమల నుంచి అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వసూలు చేసిన సొమ్మును జనసేన పార్టీకి మాత్రమే చేరవేస్తుండటంతోనే బోండా ఉమాను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలోని టీడీపీ పెద్దలే అసెంబ్లీలో దీనిపై ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ను ప్రశ్నించేలా చేశారని అన్నారు. బోండా ఉమ అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆగ్రహంతో ఊగిపోయారో చెప్పాలని అన్నారు. మొత్తం వ్యవహారం రచ్చగా మారుతుండటంతో సీఎం చంద్రబాబు దీనిని తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వ్యవహారం మీద అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడిన నేపథ్యంలో ఆశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పవన్ కళ్యాణ్ సమర్థించుకునేందుకు విఫలయత్నం చేశారు. ఆగ్రహంతో అర్థం లేకుండా మాట్లాడారు. బోండా ఉమ ఒక వ్యూహం ప్రకారమే కాలుష్య నియంత్రణ మండలి అవినీతి వ్యవహారంపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు లేవు. అయినా కూడా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించడం వెనుక టీడీపీలోని పెద్దలు ఉన్నారు. బోండా ఉమాతో ఎవరు మంత్రి పవన్ కళ్యాణ్ను ఘాటుగా ప్రశ్నించడానికి ప్రేరేపించారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. సంబంధం లేని కాలుష్య నియంత్రణ మండలి మీద బోండా ఉమ అంత హటాత్తుగా ఎందుకు ప్రశ్నించారనే దానివెనుక టీడీపీ పెద్దల దిశానిర్ధేశం ఉందా? ఇది నిజం కాకపోతే అంత థైర్యంగా ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించే శాఖపై సూటిగా ఎలా ప్రశ్నలు కురిపించారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలికి నియమించిన చైర్మన్ వల్లే పొల్యూషన్ బోర్డ్లో తీవ్ర అవినీతి జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. చాలా సంస్థలను బెదిరిస్తూ పెద్ద ఎత్తున సదరు అధికారి వసూళ్ళకు పాల్పడుతున్నారనే సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో వసూలు చేసిన సొమ్ము ఒక పార్టీకే దక్కుతుండటంతో కూటమిలోని మరో పార్టీ దీనిపై గుర్రుగా ఉందనే ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్కు చేరుతున్న అవినీతి సొమ్ము
వసూలు చేసిన సొమ్ము ఎవరికి చేరింది? హైదరాబాద్ ఐటీసీ సాక్షిగా ఏం జరుగుతోంది? ఎవరెవరు ఈ సొమ్మును వాటాలు వేసుకుని పంచుకుటున్నారనే దానిపై కూటమి పార్టీల్లోనే చాలా మంది మాట్లాడుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో కీలకస్థానంలో ఉన్న కృష్ణయ్య హైదరాబాద్లో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాధించుకున్నారనే వార్త కూడా బయటకు వస్తోంది. అంతే కాకుండా ఆయన చాలా కంపెనీలను బెదిరించి, వారి వద్ద ఉన్న కాంట్రాక్ట్లను లాక్కుని, జగ్గయ్యపేట, రాజమండ్రిలో ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా పెట్టారనే వార్త కూడా బయటకు వస్తోంది. మొత్తంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, మంత్రి వపన్ కళ్యాణ్కు మధ్య జరిగిన ప్రశ్నలతో ఈ మొత్తం అవినీతి వ్యవహారం బయటకు పొక్కింది. ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారడంతో సీఎం చంద్రబాబు దీనిని తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. కాలుష్య నియంత్రణ మండలి పరిధిలో ప్రతి సంస్థను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య వల్లే అవినీతి జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యేలే మండిపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ పై పదేపదే నీతిమాటలు చెబుతున్న పవన్ కళ్యాణ్ ఆ ముసుగులో జరుగుతున్న అవినీతిని ఎలా ఉపేక్షిస్తున్నారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ ఒక్క పవన్ కల్యాణ్ మాటలు తప్ప ఎవరి మాట వినరూ అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తన శాఖ పరిధిలోని చైర్మన్ కృష్ణయ్యకు ఏం ఆదేశాలు ఇచ్చారో చెప్పాలి? బోండా ఉమ అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్కు అంతకోపం ఎందుకు వచ్చింది? చైర్మన్ కృష్ణయ్య పెద్ద కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు, ఫార్మా, సిమెంట్ కంపెనీల నుంచి భారీగా వసూళ్ళకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరులో కృష్ణయ్య ఇంటికి సమీపంలో ఉండే వ్యక్తిని తన బినామీగా ఆయన పెట్టుకుని, ఈ వసూళ్ళకు పాల్పడుతున్నట్లు టీడీపీ, జనసేన పార్టీ నాయకులే బయట మాట్లాడుతున్నారు.
భారీ పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని వసూళ్ళు
కృష్ణయ్య చైర్మన్ అయిన తరువాత తునిలో డక్కన్ కెమికల్స్, పరవాడ లోరస్ ల్యాబ్, కడప ఇండియా సిమెంట్స్, జువారీ సిమెంట్స్ లతో పాటు పెద్దపెద్ద కంపెనీలను టార్గెట్ చేసి, తనిఖీల పేరుతో భారీగా వసూళ్ళకు పాల్పడ్డారు. ఆయన అవినీతిని తట్టుకోలేక పెద్ద పెద్ద కంపెనీలు పారిపోతున్నాయి. కృష్ణయ్యతో సెటిల్మెంట్కు రాకపోతే, టాస్క్ఫోర్స్తో తనిఖీలు చేయించి, లోపాలను చూపి ఆ కంపెనీలను మూసేయిస్తున్నారు. జగ్గయ్యపేట, రాజమండ్రిలో ప్రీ ప్రోసెసింగ్ కంపెనీలను తన బినామీల ద్వారా ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఒకదానికి అనుమతి వచ్చింది. ఫార్మా వేస్ట్ను ప్రీ ప్రాసెసింగ్ ద్వారా సిమెంట్ కంపెనీలకు సరఫరా చేసేందుకు తన బినామీలతో వ్యవహారం నడిపిస్తున్నారు. రోజుకు రూ.30 లక్షల ఆదాయం ఆర్జించాలనే లక్ష్యంతో కృష్ణయ్య పనిచేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో పదోన్నతులు, బదిల పేరుతో పెద్ద ఎత్తున కృష్ణయ్య కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ సొమ్మును తన బినామీ ద్వారా వసూలు చేయిస్తున్నాడు. ఏపీలో చిన్నచిన్న ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లకు ఫార్మా వేస్ట్ను ఇవ్వనివ్వకుండా, వారికి ఏదో ఒక సాకు చూపి, వారికి అనుమతులు ఇవ్వనివ్వకుండా, తెలంగాణలోని ప్రాసెసింగ్ యూనిట్లతో ఒప్పందాలు చేసుకున్నారు. అందుకు గానూ ఒక్కో ప్రాసెసింగ్ యూనిట్ నుంచి రూ.50 లక్షల చొప్పున వసూలు చేసుకున్నారు. దీనివల్ల ఏపీలోని చిన్నచిన్న ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు దెబ్బతింటున్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలి. పొల్యూషన్ కంట్రలో బోర్డ్ లో జరుగుతున్న అవకతవకలను టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తావిస్తే, దానిపై విచారణ జరిపించేందుకు సీఎం చంద్రబాబు ఎందుకు సిద్దంగా లేరు? అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాము నిబంధనలు అన్నీ పాటిస్తే, గత ప్రభుత్వంలో మాదిరిగా కంపెనీలు ఉండవు అని అన్నారు. అంటే గత ప్రభుత్వం ఖచ్చితంగా నిబంధనలు పాటించిందని అంగీకరించారు. ఆయన మాత్రం అలా చేయరట, ప్రజల ప్రాణాల కన్నా, పర్యావరణం కన్నా కంపెనీలే ముఖ్యమని పవన్ మాట్లాడుతున్నారు. ప్రజల జీవితాలను నాశనం చేసే కంపెనీలకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ అంగీకరించారు. సిద్దాంతాలు కేవలం చెప్పడానికే కాదు, ఆచరించడానికి అని పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం స్పందించాలి, విచారణ చేయాలి.