వైయస్ఆర్సీపీ నేతపై టీడీపీ కార్యకర్తల దాడి
అనకాపల్లి: అధికారం అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపుపాలెం మండలం రాశిపల్లి శివారు ఎరకన్నపాలెం గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ బూత్ కన్వీనర్ కొల్లి అప్పలనాయుడుపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆదివారం రాత్రి ఎరకన్నపాలెంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ చేశారు. గ్రామ శివారులో ఉన్న వైయస్ఆర్సీపీ బూత్ కనీ్వనర్ అప్పలనాయుడు ఇంటిపై బాణా సంచాకాల్చారు. దీంతో అప్పలనాయుడు ఇంటి సమీపంలోనే ఉన్న పశువులు బెదిరాయి.
పశువులు బెదురుతున్నాయని, పక్కనే గడ్డి వాము కూడా ఉందని, బాణాసంచా కాసింత దూరంలో కాల్చుకోవాలని అప్పలనాయుడు వారిని కోరాడు. వెంటనే టీడీపీ కార్యకర్తలు ఆయనపై కర్రలతో దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన ఆయన తమ్ముడు రామారావు, తల్లి సత్యవతి, తండ్రి అప్పారావును కూడా కర్రలతో కొట్టారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పలనాయుడుకు తలపై తీవ్రమైన గాయం కావడంతో గాజువాక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో, ఆయన తల్లి సత్యవతి, తమ్ముడు రామారావు ఇద్దరూ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రణాళిక ప్రకారమే దాడి
అప్పలనాయుడిపై ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని గ్రామస్థులు తెలిపారు. ఆయన ఇంటి వద్దకు టీడీపీ ర్యాలీ వచి్చన వెంటనే కరెంటు పోయిందని, అప్పలనాయుడిపై దాడి జరిగిన కొన్ని నిమిషాల్లో కరెంట్ వచి్చందని, ముందస్తుగానే కరెంటు తీసేసి దాడికి పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారే ముందుగా పోలీసు స్టేషన్కు వెళ్లి తమపై కూడా దాడి చేశారని వెళ్లి ఫిర్యాదు చేశారు.
50 మంది టీడీపీ రౌడీలు కర్రలతో దాడి
టీడీపీ గూండాలు ఉద్దేశపూర్వకంగానే అప్పలనాయుడు ఆవుల షెడ్పైకి తారాయి జువ్వలు వేశారు. దూరంగా కాల్చుకోవాలని చెప్పిన అప్పలనాయుడుపై 50 మందికి పైగా టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. ఆయన తల పగిలేలా కొట్టారు. అప్పలనాయుడును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచన మేరకు రాత్రి 12 గంటల సమయంలో విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. పోలీసు స్టేషన్లో 8 మందిపై కేసు నమోదు చేశారు. – భద్రాచలం, జెడ్పీటీసీ, మాకవరపుపాలెం మండలం