హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వైయస్ఆర్సీపీలోకి వరస కడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి రాజీనామా చేసి వైయస్ఆర్సీపీలో చేరారు. తాజాగా లోక్సభలో టీడీపీ పక్షనేత, కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే బాపనమ్మ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.
అలాగే విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, నటుడు రాజారవీంద్ర కూడా వైయస్ఆర్సీపీలో చేరారు. వైయస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న నరసింహం ఇప్పటికే టీడీపీకి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నరసింహం చేరికతో ఉభయ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీ బలం పుంజుకోనుంది.