జనరంజక పాలనలో పాలు పంచుకోవడానికే వైయస్ఆర్సీపీలోకి..
తాడేపల్లి : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జనరంజక పాలనలో పాలు పంచుకోవడానికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మాజీ ఎమ్మెల్యే యామినిబాల, ఎమ్మెల్సీ శామంతకమణి పేర్కొన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నేతలు యామినిబాల, శామంతకమణి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘దిశ’, ‘అమ్మ ఒడి’ లాంటి పథకాలకు ఆకర్షితులమయ్యే తాము వైయస్ఆర్సీపీలో చేరామని అన్నారు. వైయస్ఆర్సీపీలో చేరడం.. తిరిగి సొంతింటికి వచ్చినట్లు ఉందని తెలిపారు. టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెందే పార్టీకి రాజీనామా చేశానని అన్నారు. టీడీపీలో ప్రస్తుతం అనుభవం లేని ఆధిపత్య పోరు ఎక్కువైందని, ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నానికి విసిగి వేసారి వైయస్ఆర్సీపీలో చేరామని చెప్పారు. తనలాంటి సీనియర్లు చాలా మంది సందిగ్థంలో ఉన్నారన్నారు. సీఎం వైయస్ జగన్ జనరంజక పాలనలో పాలు పంచుకోవడానికే వైయస్ఆర్సీపీలో చేరామని తెలిపారు. శింగనమల ప్రస్తుత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో కలిసి నిజయోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.