అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పథకాలకు ఆకర్శితులైన టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. శింగనమల మండలంలోని ఇరువెందుల గ్రామంలో దాదాపు 80 కుటుంబాలు టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలోకి చేరాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అందరికీ కండువా కప్పి సాదరంగా వైయస్ఆర్సీపీకిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద వర్గాల సంక్షేమాన్నే పట్టించుకోకుండా చంద్రబాబు పరిపాలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లకి పంపలేక, ప్రైవేటు స్కూళ్లలో తమ ఆస్తులను తాకట్టుపెట్టి చదివించిన ఎన్నో సందర్భాలున్నాయని వివరించారు. నేడు వైయస్ జగనన్న పాలనలో ఎన్నో కుటుంబాలు సంతోషంతో కళకళలాడుతూ ఉన్నాయని తెలిపారు. పిల్లలు చక్కగా ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి ఇంగ్లీషు చదువు చదువుకుంటున్నారు. ఇంటికే వచ్చి రేషన్ అందిస్తున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు. నవరత్నాలు వస్తున్నాయి. మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు డబ్బులిస్తున్నారు.
ఇంతకన్నా ప్రజాసేవ చేయడానికి ఏముంటుందని భావించి ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం నుంచి తరలివస్తున్నారని ఎమ్మెల్యేగారు వివరించారు. ఇవే కాకుండా ప్రత్యేకంగా శింగనమల నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులను కూడా చూసి కూడా వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, అనుబంధ సంఘ నాయకులు వైయస్సార్ సీపీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.