ఏలూరు: జి.కొత్తపల్లిలో గత నెల 30న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్పై జరిగిన దాడి కుట్రపూరితమేనని స్పష్టమైంది. టీడీపీ వర్గీయులే ఈ దాడి చేసినట్లు ఫొటోలు, వీడియోలతో సహా బయటపడింది. గ్రామంలో అల్లర్లు రేపేందుకు, ఎమ్మెల్యేను, వైయస్ఆర్ సీపీని అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ చేసిన కుట్ర సాక్ష్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జి.కొత్తపల్లి గ్రామ వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు గంజి ప్రసాద్ గత నెల 30న హత్యకు గురయ్యాడు. హత్య విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న టీడీపీ వర్గీయులు.. గ్రూపు రాజకీయాల వల్లే ఈ హత్య జరిగిందంటూ ఎమ్మెల్యే పైకి గ్రామస్తుల్ని ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. చివరకు టీడీపీ నేతలు, కార్యకర్తలే స్వయంగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేతో పాటు పోలీసులపై దాడి చేశారు. ఈ దాడికి ముందు టీడీపీ వర్గీయులు ఘటనా స్థలానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక తోటలో మద్యం సేవించి, దాడికి కుట్ర పన్నినట్లు సమాచారం.