తాడేపల్లి: ఉక్రెయిన్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సమన్వయంతో రాష్ట్ర ఉన్నతాధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. విద్యార్థులను ప్రభుత్వం సంప్రదిస్తోంది. విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు సీఎం వైయస్ జగన్ లేఖ రాయడంతో పాటు.. ఫోన్లో కూడా మాట్లాడారు. విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని, ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు.