తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం రూ. 54 లక్షలతో నిర్మించిన పార్కింగ్ షెడ్ను శుక్రవారం సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు ఎలక్ట్రికల్ బైక్లపై రాయితీ అందిస్తామని వెల్లడించారు.. టీటీడీకి 100 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు దాతలు అందించారని తెలిపిన ఆయన.. నవంబర్ 1వ తేదీ నుంచి సర్వదర్శనం, ఎస్.ఎస్.డి టోకెన్ జారీ చేస్తామన్నాఉ.. డిసెంబర్ 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం టికెట్స్ సమయంలో మార్పులు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని వెల్లడించారు.. ముందుగా అనుకున్న విధంగా 10 గంటలు నుంచి 12గంటలు అనుకున్నాం, కల్యాణోత్సవం భక్తులు అదే సమయంలో ఉంటారు అనే సూచనతో కొద్ది మార్పులు చేశాం.. ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల మధ్య బ్రేక్ దర్శనం ప్రయోగాత్మకంగా ప్రారంభించి పరిశీలిస్తామని తెలిపారు.
టీటీడీ ఉద్యోగుల సంక్షేమం గురించి సీఎం వైయస్ జగన్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మా రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు పొకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.