విజయవాడ: విద్యపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి అని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్–2022ను మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కోరారు. చదువు మాత్రమే కాకుండా కళలు, క్రీడలవైపు కూడా తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. విద్యా రంగంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల విజయవంతానికి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలన్నారు. అనంతరం పలు కళారూపాలను ప్రదర్శించిన చిన్నారులను మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించారు.