చంద్రబాబూ.. ఈ జన్మకు బాగుపడవా ?

6 Feb, 2020 18:34 IST

సచివాలయం: హేతుబద్ధత, శాస్త్రీయత లేని ఉద్యమం చేస్తూ.. 50 రోజులు అయ్యిందని చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు హడావిడి చేస్తున్నారని, ఆయన తీరు చూస్తుంటే ఈ జన్మలో బాగుపడేట్లు కనిపించడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు వైయస్‌ జగన్‌కు పట్టం కట్టి ముఖ్యమంత్రిని చేశారు. పరిపాలన ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది.. ఏదో ఒక సాకుతో ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఏ కారణాలతో టీడీపీ అడ్రస్‌ గల్లంతు అయ్యిందో.. ప్రజాస్వామ్యాన్ని లెక్కలేని తనంతో కళ్లు నెత్తికి ఎక్కి ఒక రాజకీయ పార్టీ అధినేత వ్యవహరిస్తే ఎంత ఘోరంగా ప్రజలు బుద్ధి చెబుతారని తెలిసినప్పటికీ చంద్రబాబు ఆలోచనల్లో ఈసం ఎత్తుకూడా మార్పురాకపోవడం దారుణమన్నారు.  కరుడుగట్టిన మానసిక రోగిలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రజా నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఏం చేసినా మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చలేడని, రాష్ట్రమంతా తన కుటుంబం అని సీఎం వైయస్‌ జగన్‌ అనుకుని పరిపాలన చేస్తున్నారు. రాయలసీమ మీద ఉన్న ప్రేమ కంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలపై సీఎం వైయస్‌ జగన్‌కు రెండింతలు ఎక్కవే ఉందన్నారు. ఐదేళ్లలో ఏం చేయగలుగుతామో అది మాత్రమే చెప్పామని, చెప్పినవన్నీ తూచా తప్పకుండా అమలు చేసి చూపిస్తామన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తుగ్లక్‌ అయినా రాజధానిని మార్పు ఒక ఉద్దేశంతో చేశాడు కానీ, చంద్రబాబు కేసుకు భయపడి తెలంగాణ నుంచి పరిగెత్తుకుంటూ అమరావతి వచ్చి ఇదే నడిబొడ్డు అని మభ్యపెట్టాడు. అమరావతి రాజధాని అని ఒక చర్చ కూడా లేకుండా అడ్డగోలు నిర్ణయం తీసుకున్నాడు. తన కుటుంబం, తన కమ్యూనిటీ ఉన్న చోట కోట లాంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. దాన్ని రాష్ట్రం అంతా భరించాలని చెబుతున్నాడు. చంద్రబాబు వ్యవహార శైలి ఘోరంగా ఉండి.. ఆయన మాటలు నమ్మిమోసపోయామని బలంగా నమ్మినందువల్లే ఆ కోర్‌ క్యాపిటల్‌లోని మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో చంద్రబాబును చీత్కరించారు. ఆయన కుమారుడిని అడ్రస్‌ లేకుండా ఓడించారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్లతో గెలిస్తే.. 2019లో 10 వేల ఓట్లకుపైగా మెజార్టీఇచ్చారు. బంగారు రాజధాని నిర్మిస్తున్నాననే నమ్మకం అన్ని వర్గాల ప్రజల్లో కల్పించి ఉంటే రాజధాని ప్రాంతంలో అలాంటి తీర్పు ఎందుకు వస్తుందో చంద్రబాబు చెప్పాలి.  

వ్యక్తిగత విమర్శలు చేయడం ఎందుకు.. తిట్టడం వల్ల చంద్రబాబుకు ఏమొస్తుందో అర్థం కావడం లేదు. చంద్రబాబు తీరు అంతే వదిలేద్దాం అని అనుకుంటే.. బాబును భుజాన ఎత్తుకునే మీడియా రెచ్చిపోతుంది. పొద్దున లేస్తే.. ఏపీలో ఘోరాలు జరుగుతున్నట్లుగా చూపిస్తున్నాయి. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ హక్కా.. కాదా..? హక్కు లేకపోతే ఆ రోజు చంద్రబాబు ఏ అధికారంతో ఇక్కడికి తీసుకువచ్చారు. ఇంతమందితో చర్చించి సంతకాలు తీసుకున్నానని చూపించగలరా..? 

రాష్ట్ర అభివృద్ధిపై, రాజధానిపై సీఎం వైయస్‌ జగన్‌ కమిటీలు వేసి రిపోర్టులు వచ్చాక వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు పెట్టినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రతిపక్షం వెళ్లిపోయింది. నిజంగా అమరావతి నుంచి రాజధాని తరలించాలనుకుంటే పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాను ఎంచుకునే వాళ్లం.. కానీ, అటువెళ్లలేదు.. ఎందుకంటే అక్కడకు వెళ్లినా అమరావతిలో పెట్టాల్సిన ఖర్చు ఉంటుంది కాబట్టి. ఎక్కడైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉందో.. అన్ని కనెక్టివిటీలు ఉన్నాయని విశాఖను పరిపాలన రాజధానిగా ఎంచుకున్నారు. 

రాజధానిని ఎక్కడా మార్చలేదు. అత్యున్నతమైన శాసన వ్యవస్థ అమరావతిలోనే పెట్టారు. రాజధానిలో రెండు విభాగాలను వేరే ప్రాంతాలకు తరలించారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, భవిష్యత్తులో ఎప్పుడు అసంతృప్తి రాకుండా చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా మరో ఐదేళ్ల పాటు యాన్యువిటీ పెంచడం, రైతు కూలీలకు నెలకు ఇచ్చే సాయం రూ. 2500 నుంచి రూ.5 వేలకు పెంచడం చేశాం. అమరావతిలోని 28 వేల మంది 34 వేల ఎకరాల పొలాలు ఇస్తే.. వాళ్లలో 14 వేల మంది రైతులు కానివారు ఉన్నారు. నిజమైన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు.  రియలెస్టేట్‌ కోసం భూములు కొనుగోలు చేసిన వారికి కొంత నష్టం జరిగి ఉండొచ్చు. చంద్రబాబు తన భూముల విలువ వందల రెట్లు పెంచుకోవడానికి అమరావతిని అద్బుతమైన నగరంగా పబ్లిసిటీ చేయించారు. కానీ చేసిందేమీ లేదు. భూముల విలువలు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. తన భూముల ధరలు పడిపోతున్నాయనే చంద్రబాబు ఆరాటాన్ని ప్రజల బాధగా చూపిస్తున్నాడు. 

పేదల మధ్య తిరిగిన వైయస్‌ జగన్‌.. పేదల సంక్షేమం, రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని కలలు కన్న వైయస్‌ఆర్‌ తనయుడిగా.. తాను కూడా ఆచరణలో చూపించాలని మొదటి రోజు నుంచి కష్టపడుతున్న నాయకుడు రైతుల బాధలను నిర్లక్ష్యం చేయడు. యాన్యువిటి పెంచాల్సిన అవసరం లేదని చాలా మంది అన్నారు. నిర్లక్ష్యం చేశామని ఫీలింగ్‌ ఎవరిలో రాకూడదు. అభివృద్ధి పనులు, ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌లు రావడానికి కొంత టైమ్‌ పడుతుంది కాబట్టి యాన్యువిటీ పెంచారు. కరకట్ట రోడ్డు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలి.. ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పుకున్నాడు.. కనీసం కరకట్ట మీద రోడ్డు కూడా నిర్మించలేదు. రూ. 3 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు దాంట్లో రూ. లక్ష కోట్లను రోడ్ల డెవలప్‌మెంట్‌కు వెచ్చించి ఉంటే వైయస్‌ జగన్‌కు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది. ఆ రోజు నువ్వు ఎందుకు ఇక్కడ ఉండడం లేదని అన్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే కోట్లు పెట్టుకొని కట్టుకున్నాడని అంటున్నాడు. అది నాలుకేనా చంద్రబాబూ..? ఎవరో నది ఒడ్డున కట్టుకున్న అక్రమ నివాసంలో ఉంటున్నాడు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదు.. మానసిక వైకల్యంతో చేస్తున్న వికృత చేష్టలు. ఎనిమిది నెలల క్రితం మొహం మీద చరిచినట్లుగా స్టాంపు వేసి మరీ రెఫరెండం ఇచ్చారు. ఐదేళ్లలో ఏం చేయగలమో చూపిస్తాం అని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. ఐదేళ్లలో మరింత మేలు చేస్తాం. మళ్లీ ఎన్నికలకు వెళ్లి ఇది చేశామని ప్రజల వద్దకే వెళ్తాం. 

రాజధానిని ఎక్కడకు తరలించడం లేదు. రాజధాని నుంచి ఒక పార్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను దృష్టిలో ఉంచుకొని విశాఖకు, రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేయాలని న్యాయవ్యవస్థను కర్నూలుకు తీసుకెళ్లడం జరుగుతుంది. లేనిది క్రియేట్‌ చేసి ప్రజలను రెచ్చగొట్టాలనుకుంటే చంద్రబాబే అబాసుపాలవుతారు. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా ప్రజల మద్దతు ఉంది. వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రం అంతా ర్యాలీలు జరుగుతున్నాయి. శాసనసభ సభ్యుల మద్ధతు ఉంది. చంద్రబాబు ఏం చేసినా మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చలేరు. రాష్ట్రమంతా తన కుటుంబం అని సీఎం వైయస్‌ జగన్‌ అనుకున్నారు. రాయలసీమ కంటే ఉత్తరాంధ్ర, అమరావతి ప్రాంతాలపై సీఎం వైయస్‌ జగన్‌కు రెండింతలు ఎక్కవే ఉంది.