తెలంగాణా సీఎం వ్యాఖ్యలతో బయటపడ్డ చంద్రబాబు బాగోతం

9 Jan, 2026 15:31 IST

హైదరాబాద్:  రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పై తెలంగాణా సీఎం వ్యాఖ్యలతో చంద్రబాబు బాగోతం బయటపడ్డా.. ప్రభుత్వం ఎదురుదాడి చేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుతో రాయలసీమవాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్న ఆయన... అసలు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అవసరమే లేదన్న మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. మరోవైపు మచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట్ ఒకటే అంటూ ప్రభుత్వ అనుకూల మీడియాలో అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో అబద్దపు వార్తలు రాయడాన్ని తప్పు పట్టారు. రాయలసీమ లిఫ్ట్ స్కీం ద్వారా వైయస్.జగన్ కి మైలేజ్ వస్తుందన్న అక్కసుతోనే తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోపాటు విభజిత రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా ఉన్న చంద్రబాబు రాయలసీమ చేసిన మేలు శూన్యమని తేల్చి చెప్పారు. అన్ని ప్రాంతాలు బాగుండాలన్నదే వైయస్.జగన్ తపన అని.. తెలంగాణా వినియోగించుకున్నట్టే.. కృష్ణా జలాలతో సీమను స్టెబిలైజ్ చేసేందుకే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ చేపట్టారని స్పష్టం చేశారు. అయితే కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాన్ని రద్దు చేయడం తీరని ద్రోహమని ఆక్షేపించారు. తన కాంట్రాక్టుల కోసం పోలవరం ప్రాజెక్టునే నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. తక్షణమే రాయలసీమ లిఫ్ట్ ను ప్రభుత్వం పూర్తి చేయాలని, లేని పక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందని.. కానీ అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, అలా చేస్తే చరిత్ర మిమ్నల్ని క్షమించదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

● తప్పును సరిదిద్దుకోని చంద్రబాబు..

 కానీ సీఎం చంద్రబాబుతో సహా కూటమి నేతలు తాము  చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్న ఆలోచన చేయడం కానీ, కనీసం దాన్ని పరిశీలించే యోచన కూడా చేయకుండా ఎదురుదాడికి దిగడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు తన కేబినెట్ సహచరులతో రెండు రోజులగా అసలు రాయలసీమ లిఫ్ట్ స్కీం అవసరం ఏముంది అనేలా హేళన చేయడంతో పాటు అడ్డుగోలుగా విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యం. ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అక్కడి ప్రజలకు జరుగుతున్న నష్టంపై కనీసం ఆలోచన చేయకుండా తిరిగి ఎదురుదాడి చేయడం, వారి అనుకూల పత్రికల్లో అసలు ఈ ప్రాజెక్టే అవసరం లేదన్నట్టు వార్తలు రాయించిన తీరు  అత్యంత దుర్మార్గం. ఈ తరహా వార్తలు రాసే వారు ముందు పూర్తిగా అవగాహన కలిగించుకుని.. జరుగుతున్న నష్టాన్ని తెలియజేయాలే తప్ప మిడిమిడి జ్ఞానంతో ఆ ప్రాంతానికి జరుగుతున్న నష్టాన్ని కనీసం అంచనా వేయడం లేదు. కేవలం వైయ‌స్ఆర్‌సీపీ, వైయస్.జగన్ కి మైలేజ్ వస్తుందన్న ఒకే ఒక్క కారణంతో తప్పుదోవ పట్డిస్తూ అసత్యాలు ప్రచురించడం శ్రేయస్కరం కాదు.

● మచ్చుమర్రి సహా ప్రాజెక్టులన్నీ వైయస్సార్ చలువే...

మల్లెలలో హంద్రీనీవాకు ప్రాజెక్టు 834 అడుగుల నీటిమట్టం వద్ద నుంచి లిఫ్ట్ చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత.. కిందస్దాయిలో నీళ్లు తోడేస్తున్న నేపధ్యంలో...834 అడుగులకి  చేరడం కష్టం అవుతుంది కాబట్టి... దివంగత నేత డాక్టర్ వైయస్.రాజశేఖర్ రెడ్డే  కేసీ కెనాల్ కు, హంద్రీనీవాకు వేసవిలోనే, తాగునీరు  ఇచ్చేందుకు మచ్చుమర్రికి జీవో ఇచ్చారు. మచ్చుమర్రి పనులు ప్రారంభమైన తర్వాత  అందులో నాలుగు పంపులు కే సీ కెనాల్ కు, మిగిలిన పంపులు హంద్రీ నీవా ద్వారా జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్ కు వెళ్లేలా ఏర్పాటు చేశారు. అవేవీ తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రికి  క్యూసెక్కులుకు, టీఏసీలకు తేడా తెలియదని గతంలో చెప్పాను. అదే విషయం మరోసారి స్పష్టమవుతుంది. 790 అడుగుల్లో ముచ్చుమర్రి ప్రాజెక్టు 0.31 టీఎంసీ సామర్ధ్యం అంటే దాదాపు 3వేల క్యూసెక్కులు మాత్రమే లిఫ్ట్ చేస్తుంది. దాన్ని 3 టీఎంసీలు అని మీరు అనుకుంటున్నారు. ఆ విధంగా ప్రచురించారు. దాదాపు 33 వేల క్యూసెక్కులు వస్తే తప్ప... 3 టీఎంసీలు నీళ్లు తీసుకోవడం సాధ్యం కాదు, అది కూడా తెలుసుకోకుండా మీ ఇష్టానుసారం ముచ్చుమర్రి ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండూ సేమ్ అన్నట్టు వార్తలు రాశారు.

● సీమకు చంద్రబాబు చేసిన మేలు శూన్యం..

చంద్రబాబుకి ఒక్కటే చెబుతున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరికీ రానంతగా... అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉంటే అవకాశం చంద్రబాబుకి వచ్చినా ఆయన ప్రజలకు ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆలోచన ఆయను రాలేదు.  మల్లెల, హెచ్ ఎన్ ఎస్ ఎస్, పోతిరెడ్డుపాడు, ముచ్చుమర్రి, గండికోడ, తెలుగుగంగ ముందుకు తీసుకెళ్లే యోచన, హంద్రీనీవా చేపట్టే ఆలోచన కానీ, చివరకు పోలవరాన్ని చేయాలన్న తలపు కూడా మీకు లేదు. ఉత్తరాంధ్రా సుజల స్రవంతి, గుండ్లకమ్మ ప్రాజెక్టులు, నెల్లూరుకు చెందిన సోమశిల, నెల్లూరు బ్యారేజీ ఈ ప్రాజెక్టులు వేటి మీద మీరు ఆలోచన చేయలేదు. ఉమ్మడి రాష్ట్రానికి,కొత్త రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా చేసానని చెప్పుకోవడానికి తప్ప... రాయలసీమకు, రాష్ట్రానికి మీరు చేసిందేమీ లేదు. 

● అన్ని ప్రాంతాలు బాగుండాలన్న తపనతోనే... 

మా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలకు నష్టం జరగకూడదు అన్ని ప్రాంతాలు సమానమని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్లు 825 అడుగులులోపే 8 టీఎంసీలు ఒకేసారి తీసుకుంటున్నారు కాబట్టి... రాయలసీమలో కూడా వ్యవసాయానికి మేలు చేస్తూ.. స్టెబిలైజ్ చేయడానికి వాళ్లతో పాటు మనకూ సమాన అవకాశం ఉంటే భవిష్యత్తులో కలిసి నీటిని పంచుకునే ఆవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టారు. మీరు మాత్రం ఆ ప్రాజెక్టును బలహీనపరుస్తూ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్ ను అర్ఱం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 

● ఎగువ రాష్ట్రాల వల్ల అన్యాయం జరగకూడదనే..

శ్రీశైలం రిజర్వాయర్ పుల్ లెవల్ కి రావాలంటే ఎన్ని క్యూసెక్కులు నీళ్లు రావాలి, ప్రతి సంవత్సరం అలా నీళ్లు  రాని పరిస్ధితులలో ఎగువనున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు నీటి వినియోగానికి ఎక్కువ అవకాశాలున్నాయి. శ్రీశైలం నుంచి ఎస్ ఎల్ బీ సీ, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు, కల్వకుర్తి ప్రాజెక్టులకు తెలంగాణా 820 అడుగులు లోపే నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. మరీ అన్యాయంగా 780 వరకు పవర్ జనరేషన్ కోసం 4 టీఎంసీలు రోజూ కిందకు వదిలేస్తున్నారు. ఇవన్నీ సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. నాగార్జునసాగర్, పులిచింతల, శ్రీశైలంలో అదే పరిస్థితి ఉంది. ఈ నీరు ఎవరికీ ఉపయోగపడకుండా నేరుగా సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నీళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు పనిచేస్తుంది. నీటి ప్రవాహం తక్కువగా 70వేలు, 80 వేలు క్యూసెక్కులు వచ్చినప్పుడు ఒకేసారి వాళ్లు 8 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉన్నప్పుడు, మనకు అదే లెవల్ లో 3 టీఎంసీలు కెపాసిటీతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అంతిమంగా అన్ని ప్రాంతాలు బాగుంటాయి. కానీ చంద్రబాబు గారూ మీకు ఆ ఆలోచన లేదు. 

● పోలవరాన్నీ నిర్వీర్యం చేసిన చంద్రబాబు...

ఇవాళ పోలవరం ప్రాజెక్టును కూడా మీరు నిర్వీర్యం చేశారు. గతంలో ఎంతో కష్టంతో వైయస్సార్ ఆ ప్రాజెక్టును ప్రారంభించారు.  రాష్ట్ర విభజన తర్వాత జాతీయ ప్రాజెక్టు అయిన తర్వాత కూడా మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా  మీ కాంట్రాక్టర్ల కోసం తాకట్టు పెట్టి.. కేంద్ర ప్రభుత్వం కట్టకుండా అడ్డుకుని బలవంతంగా లాక్కుని ప్రాజెక్టుని అవినీతి మయం చేశారు.
కాపర్ డ్యామ్ మందు కట్టి.. నీటిని అరికట్టి మధ్యలో డయాఫ్రమ్ వాల్ కడితే  నాణ్యతతో వచ్చేది. కానీ ఎలాంటి ప్రణాళిక లేకుండా డయాఫ్రమ్ వాల్ ముందు కట్టడంతో కాపర్ డ్యాంలో నీళ్లు ప్లో అరికట్టలేకపోవడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీంతో పోలవరం ఆలస్యమయ్యేలా చేసింది మీరు కాదా చంద్రబాబూ?
దివంగత నేత వైయస్సార్ ప్రాజెక్టును ప్రారంభిస్తే.. ఆ తర్వాత వైయస్.జగన్ హయాంలో ప్రాజెక్టు నిధులు, ఆర్ అండ్ ఆర్ కోసం కేంద్రాన్ని ఒప్పించి జీవో సైతం విడుదల చేయించి, స్పిల్ వే సహా నిర్మాణం చేపట్టారు. మీ అనాలోచిత నిర్ణయం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను కూడా సరిదిద్దే ప్రయత్నం చేశారు. మీ వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారకులయ్యారు. కమిషన్ల కోసం మీ కక్కుర్తే ఇందుకు కారణం.

● 3 వేలకు 33 వేల క్యూసెక్కులకు తేడా తెలియదా?
 
మచ్చుమర్రి చంద్రబాబు చేశాడు.. దాని ఇమేజ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారన్న పత్రికలు అసులు ఆ ప్రాజెక్టు జీవో ఎప్పుడు వచ్చిందో చూడాలి. దానిలో ఎంత నీరు తీసుకోవచ్చో చూడండి. 834 అడుగులు వద్ద మల్లెల ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటే... మచ్చుమర్రికి మాత్రం 790 అడుగుల వద్ద కేవలం 0.31 టీఎంసీ అంటే 3 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయితే 33 వేల క్యూసెక్కులు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఆలోచన లేకుండా పోయింది. ముచ్చుమర్రి అనేది కేసీ కెనాల్, హంద్రీనీవాకు సమాంతర కాలువ ఉంది. అదే రాయలసీమ లిఫ్ట్ లో 33వేల క్యూసెక్కుల కోసం జరిగిన కాలువలు ఎలా ఉన్నాయి? పనులెంత జరిగాయో చూడండి? నీళ్లు లిఫ్ట్ చేసిన తర్వాత 33వేల క్యూసెక్కుల నీరు పోవడానికి కాలువలు ఉండాలి. ఈ కాలువలు కూడా పోతిరెడ్డిపాడు దాటిన తర్వాత బనకచర్ల క్రాస్ ముందు కలుస్తుంది. పోతిరెడ్డి పాడు నుంచి బనకచర్ల క్లాస్ వరకు ఉన్న కాలువ కూడా 80వేలక్యూసెక్కుల నీటిని తరలించడానికి అనువుగా కాలువలు వెడల్పు చేశారు. అదే విధంగా ముచ్చుమర్రి ప్రాజెక్టు చేసినప్పుడు..  హంద్రీనీవా స్థాయిని పెంచాలని కాలువల సామర్ధ్యం 3300 క్యూసెక్కులుంటే దాన్ని 6 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి అనువుగా వెడల్పు చేశారు. 

● ఉద్యమానికి సిద్ధమైన రాయలసీమ...

విధ్వంసం చేయాలన్న ఆలోచనే మీది. ఏ ప్రాజెక్టు చేయాలన్న ఆలోచన మీకు లేదు. ఖరీఫ్ లో వేగంగా నీళ్లు వచ్చినప్పుడు దిగువ ప్రాంతాలకు నీళ్లు తీసుకుని వెళ్లేటప్పుడు ఇక్కడ రైతుల పంటలను కాపాడ్డం కోసం, వాళ్లు కూడా సరైన సమయంలో పంటలు పెట్టుకోవడానికే రాయలసీమ లిఫ్ట్ పని జరుగుతుంది. ఈ ప్రాజెక్టు రాయలసీమ గుండె చప్పుడు. దయచేసి ఈ ప్రాజెక్టు అవసరం లేదని నిర్లక్ష్యంగా మాట్లాడవద్దు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ, మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్లు కూడా హేళనగా మాట్లాడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయలసీమ, అమరావతి, గోదావరి, ఉత్తరాంధ్రా ప్రాంతం ఏదైనా  రైతులందరూ బాగుండాలన్నదే మా విధానం.  మేం రైతుల పక్షాన నిలబడతాం. ఇవా అల్మట్టి ఎత్తు పెంచడం వల్ల కృష్ణా, గుంటూరు రైతులకు నష్టం జరుగుతుంది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూ.70 వేల కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులిచ్చి ఆల్మట్టి ఎత్తు పెంచే నిర్మాణ పనులు మొదలుపెడుతుంది. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అంతే తప్ప కేవలం వ్యక్తిగత లబ్ధికోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరైన విధానం కాదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే పనిచేస్తోంది. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజలు భావోద్వేగంతో ఉన్నారు.  ఉప్పెనలా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాయలసీమ నుంచి చంద్రబాబు తరలించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

● రాజధాని పేరుతో డైవర్షన్ పాలిటిక్స్...

 దీంతో మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీస్తూ మరలా రాజధాని అంశాన్ని కొత్తగా తెరపైకి తీసుకువస్తున్నారు. రాజధానికి మేం వ్యతిరేకం కాదు. అక్కడ రైతులకు మంచి జరగాలన్నదే మా విధానం. తొలివిడతలో రాజధానికి భూమిలిచ్చిన రైతులకు న్యాయం జరగలేదు. దీంతో ఆవేదన చెందిన ఓరైతు మంత్రి సమక్షంలో గుండాగి చనిపోయారు. వారికి అండగా నిలబడాలన్నదే మా విధానం. వారికిచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండో విడత  భూసేకరణకు వెళ్లడాన్ని మేం తప్పుపడుతున్నాం. దయచేసి రాజకీయ కోణంలో విమర్శలు చేసి.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశాన్ని తప్పుదోవ పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణా ప్రభుత్వంలో లోపాయికారీ ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ను రద్దు చేయడం ముమ్మాటికీ తప్పు. ఏడాదిలోగా దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది కాబట్టి.. తక్షణమే పూర్చి చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయలేని పక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా పూర్తి చేస్తుందన్ని స్పష్టం చేసిన శ్రీకాంత్ రెడ్డి ప్రజలను మాత్రం అబద్దాలతో తప్పుదోవపట్టించొద్దని హెచ్చరించారు. అలా చేస్తే టీడీపీ ప్రజా ప్రతినిధులను చరిత్ర క్షమించదని శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు.