ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసుల ఉపసంహరణ
అమరావతి: ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించారు. కేసులు ఎత్తివేయాలని ఉత్వర్హులను రాష్ట్ర హోంశాఖ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హోదా ఉద్యమ కేసులు ఎత్తివేయాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో ఐదేళ్ల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేశారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించింది. వైయస్ జగన్ సీఎం కాగానే ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదు అయిన కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కేసులు ఉపసంహరించుకోవడంతో ఉద్యమకారులు, రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అన్నది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరుగార్చారు. అయితే వైయస్ జగన్ మొదటి నుంచి కూడా హోదాపై పోరాటం చేస్తునే ఉన్నారు. సీఎం కాగానే ఢిల్లీ వెళ్లిన వైయస్ జగన్ ప్రత్యేక హోదా డిమాండును ప్రధానికి వినిపించారు.