శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందరి వారని, ఆయన ఎవరికీ వ్యతిరేకం కాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశమని, అందుకే పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధిపథంలో పయణిస్తుందని, ఆ దిశగా అడుగులు వేద్దామన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా అమదాలవలసలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్పీకర్ పాల్గొని మాట్లాడారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలని తమ్మినేని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చరిత్ర ఉందని.. నాడు ప్రజల తీవ్రమైన భావావేశాన్ని ప్రదర్శించి గట్టిగా అడిగారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, జీవించే హక్కు కోసం నాడు ఉద్యమాలు జరిగాయని స్పీకర్ తమ్మినేని తెలిపారు. పాదయాత్రలో పేదరికాన్ని గమనించిన జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకబాటు పోవాలంటే విశాఖ రాజధాని కావాలన్నారు. మళ్లీ వేర్పాటు వాదం ఉండకూడదంటే వికేంద్రీకరణ జరగాలని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ చేపట్టామన్నారు. విశాఖ రాజధాని కావడం ఉత్తరాంధ్ర కల అని.. భవిష్యత్ తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అమరావతి ఏర్పాటు కోసం 30వేల ఎకరాలు తీసుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని తమ్మినేని సీతారాం విమర్శించారు. వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వకపోతే నష్టపోతామని.. ఉత్తరాంధ్ర వాసులు చరిత్ర హీనులు కాకూడదని వ్యాఖ్యానించారు. మన ఆలోచన, మన గమ్యం, మన లక్ష్యం కూడా విశాఖపట్నం రాజధాని కావాలని ఆకాంక్షించారు. ఫాల్స్ ప్రెస్టేజ్కు పోకుండా ఉత్తరాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు ఇందుకోసం కలసిరావాలని పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతామన్నారు. అదును, పదును రెండూ వైయస్ జగన్ ఇచ్చారని.. కనుక ఈ అంశంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ రాజధాని కావాలని చంద్రబాబును ఎవరూ అడిగారు..? పాలనా రాజధాని చాలు అని స్పీకర్ అన్నారు.