అధైర్య పడొద్దు..అండగా ఉంటాం..
తాడేపల్లి: తన రెంటపాళ్ల పర్యటనలో మృతి చెందిన చీలి సింగయ్య, పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి భరోసా కల్పించారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ రెండు కుటుంబాలను రప్పించుకున్నవైయస్ జగన్.. వారిని పరామర్శించి, ఓదార్చారు. పార్టీ తరఫున అండగా నిలుస్తామని ధైర్యం చెప్పారు.
సింగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి..
చీలి సింగయ్య భార్య లూర్ధు మేరి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు వైయస్ జగన్ ఓదార్చారు. ఇప్పటికే ఆ కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా నిలిచింది. రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేసింది. ఈ తరుణంలో సింగయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన వైయస్ జగన్.. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని, ఆదుకుంటామని తెలిపారు. వారి వెంట వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ఉన్నారు.
జయవర్దన్ కుటుంబానికి ధైర్యం చెప్పి..
పల్నాడు పర్యటనలో గుండెపోటుతో మృతి చెందిన సత్తెనపల్లికి చెందిన పాపసాని వెంకట జయవర్దన్రెడ్డి కుటుంబ సభ్యులు వైయస్ జగన్ను కలిశారు. జయవర్ధన్ తల్లిదండ్రులు సావిత్రి, భాస్కర్ రెడ్డి, సోదరుడు మణికంఠ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను వైయస్ జగన్ ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కుటుంబానికి కూడా వైయస్ఆర్సీపీ అండగా నిలిచింది. తక్షణమే పార్టీ తరఫున రూ.10 లక్షల సాయం అందజేశారు. జయవర్ధన్ కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటుందని ఈ సందర్భంగా వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ కుటుంబం వెంట వైయస్ఆర్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి వచ్చారు.