తాడేపల్లి: కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ముందడుగులు వేస్తున్నారు. వరుసగా రెండవ ఏడాది వైయస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ కాసేపట్లో ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అక్టోబర్లో ఇవ్వాల్సి ఉన్నా.. కరోనా కష్టాల నేపథ్యంలో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ కాబ్ డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, రిపేర్లు, ఇంకా ఇతర అవసరాల కోసం నాలుగు నెలల ముందుగానే సీఎం వైయస్ జగన్ సాయం అందిస్తున్నారు. వైయస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఈ ఏడాది 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకే రూ.10 వేలు చొప్పున జమ చేయనున్నారు. గత ఏడాదితో పోల్చితే అదనంగా 37,756 మంది వాహన మిత్ర లబ్ధిదారులకు సాయం అందనుంది.