చేనేతలకు రూ.24 వేలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్ది
తాడేపల్లి: చేనేత కుటుంబానికి రూ. 24 వేలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్దేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో చేనేత కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేతలకు అండగా నిలిచేందుకు సీఎం వైయస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రూ.3.60 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిందని, రాజధాని పేరుతో బినామీ కంపెనీలతో చంద్రబాబు దోచుకున్నారని, బాబు అమరావతి పేరుతో భ్రమ సృష్టించారని ధ్వజమెత్తారు. అవినీతి కప్పిపుచ్చుకునేందుకు రాజధాని పేరుతో చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే దిశగా సీఎం వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారన్నారు. ప్రతి సంక్షేమ పథకం పారదర్శకంగా అమలు చేస్తున్నారని వివరించారు. సీఎం వైయస్ జగన్ విజన్ ఉన్న నాయకుడన్నారు.