దుష్ప్రచారం తిప్పికొట్టాలి

17 Dec, 2021 08:53 IST

 తాడేప‌ల్లి:  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రతిపక్షాలు, పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొడుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ పథకం అమలులో ఎలాంటి ఒత్తిడి లేదని, అది పేదలకు మేలు చేసేదని వివరించాలన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులతో గురువారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.

జగనన్న గృహ హక్కు పథకంపై చంద్రబాబు కుట్ర పూరితంగా, పచ్చ మీడియాతో కలసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అంశమన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్‌ 21న సేవా కార్యక్రమాలను విరివిగా చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ద్వారా అటు పర్యావరణ పరిరక్షణతో పాటు అందరికీ స్ఫూర్తిని ఇచ్చినట్లు అవుతుందన్నారు.