వివేకానందరెడ్డి హత్యకేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారం 

18 Feb, 2022 19:02 IST

 తాడేప‌ల్లి:  వైయ‌స్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు వ్యంగ్యంగా మాట్లాడబోయి అపహాస్యం పాలువుతున్నారని  ఎద్దేవా చేశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 

  ఎప్పుడూ చిటపటలాడుతుంటే చంద్రబాబు ఈ మధ్య వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఒక సీరియస్‌ విషయాన్ని హాస్యధోరణిలో చెప్పబోయి అపహాస్యం పాలవుతున్నారని చంద్రబాబు గుర్తిస్తే బావుంటుందని సజ్జల మండిపడ్డారు. 
రాజకీయాల్లో.. రాజకీయ విమర్శలు చేయటం, ప్రజలకు సంబంధించిన అంశాలపై నిలదీయటం జరుగుతాయి. రాజకీయ పార్టీల మధ్య చాలా అంశాల మీద విబేధాలుంటాయి. రాజకీయ పార్టీ ఉనికి వేరు కాబట్టి  విబేధాలుంటాయి. అవి వెల్లడించవచ్చు. కానీ అవి చెప్పేటప్పుడు దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. ఒక ఆధారం ఉండాలి. చెప్పిన విషయం సూటిగా దీనిపై మాట్లాడుతున్నామని స్పష్టంగా చెప్పాలి. ఈ మధ్య లోకేశ్‌ ట్విట్టర్‌లో జోకులు వేస్తున్నాడు. ఎదిగే అవకాశం ఉన్న నాయకుడు దేనికీ పనికిరానివాడిలా తయారయ్యాడు. ఎదగటానికి అవకాశంలేని చంద్రబాబు వెనకదారిలో వచ్చి మ్యానిప్యులేట్, మేనేజ్‌మెంట్‌ ద్వారా బ్రతికారు. ఈ వయస్సులో చంద్రబాబు జోక్‌లు వేస్తున్నారు. 

ఈ ప్రశ్నలకు సీబీఐ లేదా వివేకా మరణాన్ని రాజకీయం చేస్తున్న చంద్రబాబు సమాధానం చెప్పాలి.... 

1) వివేకానందరెడ్డిగారి మరణవార్త తనకు శివ ప్రకాశ్‌రెడ్డిద్వారా తెలిసిందని, అది కూడా గుండెపోటు అని తెలిసింది అని ఆదినారాయణరెడ్డి చెప్పిన విషయం మీద సిబిఐ ఎందుకు దర్యాప్తు  చేయటం లేదు? అదే శివ ప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ చేస్తేనే అవినాష్‌ అక్కడికి వెళ్ళాడు.

2) ఎంపీగా పోటీ చేసిన అవినాష్‌ క్యాంపెయిన్‌ కోసం... అక్కడ నాయకులను అవినాష్‌కు అనుకూలంగా ఒప్పించటం కోసం తన తండ్రి ముందురోజు రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వివేకానందరెడ్డిగారి కుమార్తె సునీతమ్మ చెప్పటం నిజం కాదా?  గుండెపోటు అని ప్రాపగేట్‌ చేశారంటున్న సిబిఐవారు... ఆ విషయం చెప్పింది శివప్రకాశ్‌రెడ్డి అన్న విషయం మీద దర్యాప్తు చేయటం లేదు 

3) కృష్ణారెడ్డి దగ్గరే వివేకానందరెడ్డిగారు రాసిన చివరి లేఖ ఉంది. అది ఎందుకు వెంటనే బయటపెట్టలేదు? ఎవరు బయటపెట్టవద్దన్నారు? శవాన్ని ముట్టుకోకుండా ఉండేలా ఈ లేఖను ఎందుకు బయటపెట్టలేదు? ఆ లేఖ బయటపెడితే ఎవరూ శవాన్ని ముట్టుకోకుండా పోలీసులు ఆపేవారు కదా? 

4) లేఖ బయటపెట్టకుండా ఆపిన రాజశేఖర్‌రెడ్డి ఎవరు? శివప్రసాదరెడ్డికి సొంత సోదరుడు, వివేకానందరెడ్డిగారి బావమరిది కాదా? మరి ఇంత కీలకమైన విషయం మీద దర్యాప్తు ఎందుకు జరగలేదు? రాజశేఖరరెడ్డి ఆపటం వల్లే కృష్ణారెడ్డి ఆ లేఖ ఇవ్వలేదన్న విషయం మీద ఎందుకు దర్యాప్తు జరగలేదు?  ఆదినారాయణరెడ్డి ఫోన్‌ కాల్స్‌మీద సిబిఐ విచారణ ఎందుకు జరగలేదు? 

*5) వివేకాగారి ఓటమికి కారణమైన బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి; వీరిద్దరితో చంద్రబాబు నాయుడు నడిపిన వ్యవహారాలమీద, వారి ఫోన్‌ కాల్స్‌మీద ఎందుకు దర్యాప్తే చేయలేదన్నది కూడా ఆశ్చర్యంగా ఉంది. 
సునీతమ్మను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలి... కుటుంబాన్ని ఎలాగోలా చేర్చాలి... నేరాన్ని కుటుంబం మీదే తొయ్యాలి... ఇది చంద్రబాబు వ్యూహం. ఈ నిజాలన్నీ బయటకు రావాలి. దర్యాప్తుకు సంబంధించి అసలు నిజాలు తెలియాలంటే... ఈ అంశాలన్నింటినీ విస్మరించి అవినాష్‌ను ఎందుకు ఇరికించాలని అనుకుంటున్నారన్నది అందరికీ అర్థమవుతుంది* 


గుండెపోటు దర్యాప్తును ఎలా ప్రభావం చూపగలదు
గుండెపోటు అని ఎవరు అన్నారో మొన్న చెప్పటం జరిగింది. ఎవరి రెస్పాన్సబులిటీ లేదు. ఈరోజు అవినాశ్‌ రెడ్డి బాధ్యత కూడా లేదు. వివేకా బాడీ దొరికింది. అప్పుడు కాకపోయినా గంటకైనా మర్డర్‌ అని తెలుస్తుంది. గుండెపోటు అనే మాట వచ్చినా ఇన్వెస్టిగేషన్‌ను ఎవరు ఏమి చేయగలరు? ఏరకంగా ఆ అంశం దర్యాప్తును మారుస్తుంది. ఈ ఆలోచన, ఈ ఇంగితం చిన్న పిల్లాడికైనా ఉంటుంది. ఆ మాట అన్నారా? లేదా అన్నది మళ్లీ చెబుతా. 

ఎవరు చేశారో, ఎవరి ప్రోద్భలంతో అనేది దర్యాప్తులో తేలాలి
ఫస్ట్‌ గుండెపోటు అన్నారు. తర్వాత గొడ్డలిపోటు అన్నారని చంద్రబాబు అంటున్నారు. రెండో అంశంలో సాక్ష్యాలను టాంపర్‌ చేసి క్లీన్‌ చేయటమనేది పెద్ద నేరం. అది ఎవరు చేసినా శిక్షించాల్సిందే. ఎవరు చేశారో ఊర్లో అందరికీ తెలుస్తుంది. ఎర్ర గంగిరెడ్డి అనే వ్యక్తి అక్కడే ఉన్నాడు. అతని ప్రోద్భలంతో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది దర్యాప్తులో తేలుతుంది. ఇప్పుడు దాని జోలికి పోవటం లేదు. 

సిట్‌ విచారణ తర్వాత గుండెపోటు అన్నది ఆదినారాయణ రెడ్డే
గుండెపోటు అన్నది ఎవరో వీడియో వేసి చూపించాం. ఆదినారాయణ రెడ్డి మా పార్టీలో ఎన్నికై ఫిరాయించి టీడీపీలో మంత్రి అయ్యాడు. ఆయన సిట్‌తో మాట్లాడిన తర్వాత చెప్పాడు. శివప్రకాశ్‌ రెడ్డి ఫోన్‌ చేస్తే.. స్మోకింగ్‌ ఆపలేదు. స్టంట్‌ వేసుకొని ఉన్నారు. హెమరాయిడై.. హార్ట్‌ అటాక్‌ వచ్చి చనిపోయారని అన్నారు. అది వీడియోలో ఉంది. సీబీఐ లాంటి సంస్థ అలాంటివి చూడరా. ఇన్వెస్టిగేషన్‌ అంటే.. ఎదురుగా ఉన్న సాక్ష్యాలు చూడరా. ఇవి అబద్ధం. ఇది ఫ్యాబ్రికేటెడ్‌ వీడియో అని చెప్పాలా? దాన్ని తీసుకోకుండా ఇన్వెస్టిగేషన్‌ చేయటం ఏమిటి?

లెటర్‌ ఉందని తెలిస్తే ఎవరైనా బాడీ దగ్గరకు వెళ్లనిచ్చేవారా?
సాయంత్రం వరకు లెటర్, ఫోన్‌ ఎందుకు దాచారు?
ఆ లెటర్‌ ఉందని సీఐ, మొదటి వచ్చిన వారికి చెప్పినా ఎవరినైనా ఆ బాడీ దగ్గరకు వెళ్లనిస్తారా? ఈ ప్రశ్న వస్తుందా? రాదా? ఆ ప్రశ్నకు చంద్రబాబు ఏమి సమాధానం ఇస్తారు. సీబీఐ కన్నా ఎక్కువ ఇన్వెస్టిగేషన్‌ చేయగలిన వ్యక్తి కదా. అందుకే చంద్రబాబునే అడుగుతున్నాం. దాన్ని వదిలేసి మా సీబీఐ రాసిందని ఇక అయిపోయిందని చంద్రబాబు అంటున్నారు. ఆ లెటర్‌ వచ్చినట్లైతే అది జరిగి ఉండేది కాదు. సాయంత్రం వరకు లెటర్, ఫోన్‌ ఎందుకు బయటకు రాలేదు. రాజశేఖర్‌ రెడ్డి ఎందుకు దాచి పెట్టమన్నారు. అది లోతుగా దర్యాప్తు చేయాల్సిన అంశం కాదా? అందరం దగ్గర వాళ్లు. బావుండాలని అనుకునేవాళ్లం కాబట్టి ఇందులో ద్రోహ చింతన ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అప్పుడు ఎవరి కారణాలు వారికి ఉంటాయి. 

సీబీఐ చార్జిషీటులో మేం పాయింట్‌ అవుట్‌ చేసింది ఇంకొకటి ఏమిటి అంటే.. వివేకానంద రెడ్డి కానీ, షర్మిలమ్మ, విజయమ్మ కానీ కావాలి తప్ప అవినాష్‌ రెడ్డి కాకూడదని అనుకోవటం వల్ల ఎంపీ అవినాష్‌ రెడ్డి తన మనుషులతో చంపించారని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఇంత అడ్డగోలు కామెంట్‌ చేస్తుందా? ఎంపీ మీద ఇలా అడ్డగోలు ఆరోపణలు చేస్తారా? 

మీడియా, ప్రపంచం మొత్తానికి తెల్సు. అప్పటికీ సిట్టింగ్‌ ఎంపీ. ఆయన విజయం కోసమే అందరి కంటే ఎక్కువ బాధ్యత తీసుకొని వివేకానంద రెడ్డి పనిచేస్తున్నారు. ఆ పార్లమెంట్‌ మొత్తం వివేకానందకు కొట్టిన పిండి. జిల్లా మొత్తం చూస్తుండటం. ఆ పార్లమెంట్‌ వ్యవహారాలు చూడటంతో పాటు గతంలో వైయస్‌ఆర్‌ కోసం కృషి చేశారు కూడా. సహజంగా వివేకానంద రెడ్డి సారధ్యం వ్యవహరించారు. జగన్‌ అన్నను సీఎం చేయటం, అవినాష్‌ను ఎంపీగా గెలిపించటం అనే టాస్క్‌ మీదనే ఉన్నారని సునీతమ్మ కూడా మాట్లాడారు. ఇంత ఓపెన్‌గా అందరికీ తెల్సింది. కానీ సీబీఐ అడ్డగోలుగా చార్జిషీటులో వేస్తే.. దాన్ని ఆధారంగా చంద్రబాబు మాపై బండ వేస్తామంటే మేం ఎలా ఒప్పుకుంటాం? 

ఫోన్‌కాల్‌తో వచ్చిన అవినాష్‌ మీద చంద్రబాబు ఆరోపణలు అన్యాయం
ఇంట్లో వారికంటే సన్నిహితంగా ఎర్రగంగిరెడ్డి ఉండేవారు

ఫ్యామిలీ మెంబర్స్‌ ఎవ్వరూ లేనప్పుడు ఎక్కడైనా ఏదైనా జరిగితే మొదట షాక్‌ అవుతాం. సమాచారం పంపిస్తాం. అందులో పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్న ఫ్యామిలీ. దాంట్లో ఉండే కన్‌ప్యూజన్‌ కొంత పనిచేసి ఉండొచ్చు. ఏ రకంగా ఈ ఫ్యాక్టర్‌. మధ్యలో చంద్రబాబు పాయింట్‌ అవుట్‌ చేసిన ఎర్ర గంగిరెడ్డి, మిగిలిన వారు ఇంట్లో వారికంటే సన్నిహితంగా ఉండేవాళ్లు. అలాంటి వాళ్లు టాంపరింగ్‌ చేసే ప్రయత్నం చేస్తే.. దాన్ని అడ్డుకోలేదో.. దాన్ని చేయమన్నారని చంద్రబాబు ఆరోపించటం సరికాదు. ఫోన్‌ కాల్‌ మీద వచ్చిన వ్యక్తిని (అవినాష్‌) తీసుకొచ్చి నేరుగా ముడివేసేసి ప్రయత్నం చేయటమనేది అన్యాయం గాక న్యాయం అవుతుందా చంద్రబాబు గారూ అని సజ్జల ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీబీఐని ఎలా ఇగ్నోర్‌ చేస్తారని అడిగాం.ఈ రోజు చంద్రబాబును అడుగుతున్నామన్నారు.  

సీబీఐ పది అడుగులు చార్జిషీట్‌ వేస్తే బాబు వంద అడుగుల స్టేట్‌మెంటా
చంద్రబాబు లాంటి ఒక అబద్ధాన్ని ఆయన మాటల్లో వీడియో వేసుకొని చూస్తే కనిపిస్తోంది. సీబీఐ పది అడుగులు అడ్డగోలుగా చార్జిషీటులో చేస్తే.. దానికి చంద్రబాబు వంద అడుగులు ముందుకు వేసి ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశాడు. మొదటి వచ్చిన అవినాష్‌ రెడ్డి ఆధ్వర్యంలోనే మొత్తం అంతా జరిగిపోయిందని. మర్డర్‌ జరిగిందనో, క్లీనింగ్‌ జరిగిందనో మీడియా వాళ్లు అనుకోవచ్చు. 

పచ్చి అబద్ధాలు చార్జిషీటులో సీబీఐ వండివార్చింది 
చార్జిషీటు ఆధారంగా అవినాష్‌ రెడ్డికి శిక్ష వేయాలని చంద్రబాబు తీర్మానమా?
– సీబీఐ పచ్చి అబద్ధాలు వండివార్చిందని మేం అంటున్నాం. దాన్ని తీసుకొని అవినాష్‌ రెడ్డికి శిక్ష వేయాలని తీర్మానం చేసేరకంగా చంద్రబాబు మాట్లాడటంతో ప్రశ్నిస్తున్నాం. రెండు, మూడు బేసిక్‌ అంశాలున్నాయి. అవినాష్‌ రెడ్డి విజయం కోసమే వివేకానంద రెడ్డి పనిచేస్తుంటే టిక్కెట్‌ కోసం అవినాషే చంపించారనే వైఖరిని చంద్రబాబు తీసుకుంటున్నావా? లేక కాదంటున్నావా? కాదంటే ఇన్వెస్టిగేషన్‌ సరైన మార్గంలో పోనట్టే కదా.

నిజాలు బయటకు రావాలి. దర్యాప్తు సక్రమంగా జరగాలి 
– ఎవరు చేసేది బయటకు రావాలి. కచ్చితంగా తేలాలి. ఇన్వెస్టిగేషన్‌ సక్రమంగా జరిగినట్టు కనిపించాలి. ఆ పాయింట్స్‌ చూస్తే కరెక్టు అనిపించాలి. దానికి భిన్నంగా ఏమైనా ఉంటే వాటికి సమాధానాలు ఇవ్వాలి. సీబీఐ వాళ్లు కాకపోతే చంద్రబాబు ఇవ్వాలని ఆయన్ను అడుగుతున్నాం. అక్కడ యంగ్‌ లీడర్‌ తయారవుతున్నాడు. గతంలో శ్రీ జగన్‌ మీద సూట్‌ కేసు బాంబు అని అలాగే పడ్డారు. రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఎమోషనల్‌ అయి మాట్లాడాల్సి వచ్చింది. అంతకంటే నీచమైంది ఎక్కడా ఉండదు. ఒక లీడర్‌ తయారవుతుంటే..మొక్కలో తుంచేద్దాం అనేది చంద్రబాబు తీరు.