అమరావతి: టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కాంస్య పతకం ససాధించడం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆమెను అభినందించారు. పీపీ సింధు శుక్రవారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. మీ ఆశీర్వాదంతో కాంస్యం సాధించానని సీఎం జగన్తో సింధు అన్నారు. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం అభినందించారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలన్నారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదును అధికారులు అందించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రభుత్వం క్రీడలను బాగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఒలింపిక్స్లో రాణించాలని సీఎం వైయస్ జగన్ తనను ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్కు 2 శాతం రిజర్వేషన్ గొప్ప విషయం అని పేర్కొన్నారు. నేషనల్స్లో గెలిచిన వారికి వైఎస్సార్ పురస్కార అవార్డులు ఇస్తున్నారన్నారు. అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని.. త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తానని పీవీ సింధు తెలిపారు.