ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ..శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు అనేకం చేసి విజయం సాధించాలని, మరెన్నో మైలు రాళ్లు అధిగమించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. సీఎంఎస్-01 కమ్యూనికేషన్ శాటిలైట్ను నింగిలోకి ఇస్రో పంపింది. సీ-బ్యాండ్ సేవల విస్తరణకు సీఎంఎస్-01 దోహదపడనుంది. ఏడేళ్లపాటు సేవలందించనుంది. జిశాట్-12 స్థానాన్ని సీఎంఎస్-01 శాటిలైట్ భర్తీ చేయనుంది. సీఎంఎస్ -01 దేశానికి చెందిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం కాగా, పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం మొదటి దశ విజయవంతం అయ్యింది.