అమరావతి: జిల్లాలో అందరినీ కలుపుకుని వెళతానని మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పినిపె విశ్వరూప్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్ క్యాబినెట్ కూర్పు అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే విధంగా ఉందని అన్నారు. గతంలో తాను మంత్రిగా వ్యవహరించానని, ఆ అనుభవం ఇప్పుడు అక్కరకొస్తుందని భావిస్తున్నానని తెలిపారు. రెండున్నరేళ్లు మంత్రిగా, ఆపై రెండున్నరేళ్లు పార్టీ కోసం పనిచేయాలన్న వైయస్ జగన్ సిద్ధాంతం ఆకట్టుకునేలా ఉందన్నారు. ఏ ప్రభుత్వం చేయని రీతిలో ఎస్సీలు, బీసీలతో పాటు అన్ని వర్గాలకు వైయస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారని విశ్వరూప్ కొనియాడారు. మంత్రిగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అందరినీ కలుపుకుని వెళ్లడంపై దృష్టిపెడతానని స్పష్టం చేశారు.