అమరావతి: సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే సినిమా టికెట్ ధరలు ఉన్నాయని రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. సోమవారం ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఆర్జీవీ తాను చెప్పాల్సింది చెప్పారని.. ప్రభుత్వ నిర్ణయాలు చట్టప్రకారమే జరుగుతున్నాయని తెలిపారు.
ఇప్పటికే సినిమా టికెట్ అంశానికి సంబంధించి కమిటీ ఏర్పాటయ్యిందన్నారు. కమిటీ సూచనల ప్రకారం తదుపరి నిర్ణయాలు ఉంటాయి. ఆర్జీవీ చెప్పిన అంశాలను ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్లకు 50 శాతం మాత్రమే అనుమతిస్తున్నామని.. అందరూ సహకరించాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు.