ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
విశాఖపట్నం: ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భీమిలి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్య ర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధార షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడిని చూస్తే జాలిగా ఉందన్నారు. ఆయన మరీ దిగజారిపోతున్నారని, కాంగ్రెస్ వారి కంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి శాలువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తీరుతో తెలుగు వారి పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగని విధంగా తమ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని మరో 24 గంటల్లో రాష్ట్రంలో రాజన్న పాలన రాబోతుందని చెప్పారు. సొంత వదినను చంపిన దేవినేని ఉమామహేశ్వరావు, బుద్ధిలేని బుద్ధా వెంకన్నలు మీడియా ముందుకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.