అమరావతి: కోవిడ్ కష్టకాలంలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆగకుండా అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. కరోనా, లాక్డౌన్ కారణంగా పింఛన్ లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొకూడదనే ఉద్దేశంతో వైయస్ఆర్ పింఛన్ కానుక పథకాన్ని యథావిధిగా అమలు చేస్తున్నారు. తెలవారకముందే వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. లబ్ధిదారులకు జూన్ ఒకటో తేదీ నుంచే వాలంటీర్ల ద్వారా పింఛను డబ్బులు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి జూన్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61,46,908 మందికి పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఇందుకు రూ.1,497.63 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం సాయంత్రానికే ఆయా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి బయో మెట్రిక్ విధానంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
కొత్తగా మరో 29,961 మందికి పింఛన్లు
రాష్ట్ర వ్యాప్తంగా మరో 29,961 మంది పేదలకు ప్రభుత్వం కొత్తగా ఈ నెలలో పింఛన్లు మంజూరు చేసినట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 1,726 మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెలా రూ.10 వేల చొప్పున, మరో 28,235 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు సాధారణ పింఛన్లను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.