ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు ఆర్టీఐ విభాగం సిద్ధంగా ఉండాలి
తాడేపల్లి: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకురావడంలో ఆర్టీఐ విభాగం కీలక పాత్ర పోషించాలని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఆర్టీఐ విభాగ రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సమావేశానికి పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్చార్జ్, ఎమ్మెల్సీలేళ్ల అప్పిరెడ్డి, ఆర్టీఐ వింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతు శ్రీధర్రెడ్డి, మాజీ ఆర్టీఐ కమిషనర్లు రేపాల శ్రీనివాసరావు, కాకర్ల చెన్నారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా మరియు నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, “ఆర్టీఐ విభాగంలో సుశిక్షితులైన సైన్యం సిద్ధంగా ఉండాలి. పార్టీ ఆశయాలు, నాయకుడు వైయస్ జగన్ గారి దిశానిర్దేశం ఏమిటో తెలుసుకుని ప్రజా సమస్యలపై బలమైన గళం వినిపించాలి” అని అన్నారు. “కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. టీడీపీ ముసుగులో జరుగుతున్న పాలనలో అవినీతి వ్యవస్థీకృతంగా సాగుతోంది. ప్రతి పనిలో లంచాలు, వాటాలు సాధారణమయ్యాయి. ఈ అవినీతి వ్యవహారాలను ఆధారాలతో బయటపెట్టేందుకు ఆర్టీఐ విభాగం చురుకుగా పనిచేయాలి” అని సూచించారు.
మీడియా, వ్యవస్థలను ప్రభావితం చేస్తూ అవినీతిని దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వాటిని బట్టబయలు చేయడంలో ఆర్టీఐ విభాగం ముందుండాలని పిలుపునిచ్చారు. “నాడు-నేడు వంటి కార్యక్రమాలను పక్కనపెట్టి విద్యా వ్యవస్థను దెబ్బతీశారు. ఇప్పుడు గత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని విమర్శించారు.
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, “ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలపై సమాచారం సేకరించి ప్రజల ముందుంచడంలో ఆర్టీఐ విభాగం ప్రధాన పాత్ర పోషించాలి. వైయస్ఆర్సీపీ శ్రేణులపై వేధింపులు పెరిగినా, మనం వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగించాలి” అని అన్నారు. ఆర్టీఐ ద్వారా అవినీతి నిరూపణకు ఆధారాలు సేకరించి, ప్రజలకు నిజాలను తెలియజేయాలని, ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో వైయస్ఆర్సీపీ గెలుపు సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.