రాయలసీమ లిఫ్టును పూర్తి చేయల్సిందే
నందికొట్కూరు: సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్టు పూర్తి చేసేదాకా పోరాటం ఆపకుండా ఉధృతం చేస్తామని, ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ సమాధి కావడం తథ్యమని వైయస్ఆర్సీపీ రాయలసీమ నాయకులు హెచ్చరించారు. నందికొట్కూరులో నిర్వహించిన చలో పోతిరెడ్డిపాడు సభ ప్రారంభం మాత్రమేనని.. రాబోయే సభ కడపలో ఉంటుందని స్పష్టం చేశారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ సభలు నిర్వహించి ప్రతి గ్రామంలోనూ ప్రజలకు అవగాహన కల్పిస్తామని వివరించారు. వైయస్ఆర్సీపీ పిలుపుతో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. పార్టీ సీనియర్ నాయకులంతా దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బహిరంగ సభను ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు సభకు పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని చూశారని నాయకులు మండిపడ్డారు. అప్పటికప్పుడు సందేశాలు పంపినా రాయలసీమ జిల్లాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారని చెప్పారు. కేవలం 12 గంటల సమయమే ఉన్నా సభకు చకచకా ఏర్పాట్లు చేసిన నంద్యాల జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, పార్టీ యుజజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి దారా సుధీర్ లను నాయకులు అభినందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీఎం చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతలను నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు లేవనే సాకుతో ఇన్నాళ్లు రాయలసీమకి సంజీవని లాంటి ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినందుకు చంద్రబాబుని భవిష్యత్ తరాలు క్షమించవని హెచ్చరించారు. ఆయన ఎప్పుడు సీఎంగా ఉన్నా రాయలసీమ ప్రాంతానికి అన్యాయమే జరుగుతోందని, ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతం నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్నా.. రాయలసీమకు నిత్యం అన్యాయమే చేస్తున్న చంద్రబాబుకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రాజెక్టును పెండింగ్ పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. లేదంటే వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా యుద్ధప్రాతిపదికన ప్రారంభించి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ప్రజా రైతు సంఘాల వారు భారీగా తరలివచ్చి విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏమన్నారంటే..:
● ప్రతినీటి బొట్టుపై వైయస్సార్ పేరు ఉంటుంది: సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్
రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఇప్పటికైనా మొదలుపెట్టి పూర్తిచేయకపోతే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ సమాధి కావడం ఖాయం. వైయస్ఆర్సీపీ హయాలోనే పనులు 80 శాతం పూర్తయినా మిగతా పెండింగ్ పనులు పూర్తి చేయకుండా ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని సాకుచూపుతూ 20 నెలలుగా పక్కనపెట్టేశారు. 20 శాతం పెండింగ్ పనులు పూర్తి చేసి రాయలసీమ లిఫ్టును అందుబాటులోకి తెచ్చే అవకాశం చంద్రబాబుకి దక్కినా పట్టించుకోలేదు. అయితే రేవంత్రెడ్డి మాటలతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. తాను చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్టును ఆపేయించానని తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించడం మాత్రమే కాకుండా అసమరమైతే తన మాటలపై అన్ని పార్టీల నాయకులతో నిజనిర్ధారణ కమిటీకి కూడా సిద్ధమని ప్రకటించాడు. ఇదంతా జరిగి నెలరోజులు పూర్తయినా చంద్రబాబు దానికి సమాధానం చెప్పుకోవడం కానీ లేదా ఆయన మాటలు నిజం కాదని చెప్పడం కానీ చేయలేదు. అసలు ప్రాజెక్టే దండగని టీడీపీ నాయకులతో ప్రచారం చేయిస్తున్నాడు. చంద్రబాబు మరీ దిగజారిపోయి 20 టీఎంసీల కోసం ఎందుకంత పాకులాట అని మాట్లాడుతున్నాడంటే రైతుల సమస్యలపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా ఓటుకు కోట్లు కేసుకు భయపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు. ఆయన సీఎంగా ఉండగా పక్క రాష్ట్రాలు యథేచ్ఛగా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ మనకు దక్కాల్సిన నీటిని తోడేస్తున్నాయి. 40 ఏళ్ల కిందట వైయస్సార్ చేసిన పాదయాత్ర, నిరాహార దీక్ష ఫలితంగానే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకి బీజం పడింది. రాయలసీమ, నెల్లూరుకి వెళ్లే ప్రతి నీటి చుక్క మీద కూడా వైయస్సార్, వైయస్ జగన్ల పేరు ఉంటుంది. నీళ్లు, రైతు, వ్యవసాయం ఎక్కడ బాగున్నా రాష్ట్రమంతా బాగుంటుంది. ఈ ఆలోచన ఉంది కాబట్టే వైయస్ రాజశేఖర్రెడ్డి గారు ఆనాడు సాగునీటి రంగం మీద ప్రత్యేకంగా దృష్టిసారించి ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచడమే కాకుండా పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని కూడా దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభిస్తే.. 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ పనులను పూర్తి చేయలేదు. 2019లో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తిగా వాడకంలోకి తెచ్చారు. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి ఇక్కడి నుంచే నాంది పలకాలి. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ పేరుతో వైయస్ జగన్ చేసిన మేలు ప్రతి ఇంటికీ తెలియాలి. పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టును ఆపేయడం అంటే మహాపాపమే. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోకతప్పదు. చంద్రబాబు ప్రాజెక్టులు మొదలుపెట్టి కమీషన్లు తీసుకుంటాడే కానీ దేన్నీ పూర్తిచేయడు. ఈ ప్రజా ఉద్యమంలో కలిసొచ్చే పార్టీలతో వెళ్లి ఉద్యమిస్తాం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయస్ జగన్మ సీఎం కావడం తథ్యం. ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం.
● అమరావతి జపం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నాడు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్
కరోనా సంక్షోభాన్ని కూడా లెక్కచేయకుండా రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టను శరవేగంగా ముందుకు నడిపించిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. రెండేళ్లలోనే 80 శాతం పనులు పూర్తిచేస్తే, 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుమ్మక్కై దాన్ని పూర్తిగా పక్కనపెట్టేశాడు. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ నిలిచిపోతే కేసీ కెనాల్కి, హంద్రీనీవాకి, గాలేరు - నగరికీ నీళ్లుండవు. అనంతపురంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని హంద్రీనీవా కాలువను 3800 క్యూసెక్కుల నుంచి 6500 క్యూసెక్కులకు పెంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పనులు నిలిపివేయడమే కాకుండా రూ. 2 వేల కోట్లతో కాంక్రీట్తో లైనింగ్ పనులు చేపట్టారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహించే కుప్పంకి నీరిచ్చిన ఘనత కూడా వైయస్ జగన్కే దక్కుతుంది. గాలేరు-నగరి ద్వారా చిత్తూరు, కడప జిల్లాలకు నీళ్లిచ్చే పనులను 50 శాతం పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని కూడా పక్కనపెట్టేసింది. రాయలసీమలో ఏ ప్రాజెక్టును కూడా పూర్తికానీయకుండా అమరావతి జపం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నాడు. ఎప్పుడు పూర్తవుతుందో అర్థంకాని, వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతం కోసం చంద్రబాబు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి పాట పాడుతున్నాడు. చంద్రబాబు సీఎం అయ్యాకనే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నాడు.
● 1986 లోనే దివంగత వైయస్సార్ పాదయాత్ర : కాటసాని రాంభూపాల్రెడ్డి, నంద్యాల జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు
1986 లో లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు దివంగత మహానేత వైయస్సార్ చేసిన పాదయాత్రలో నేను పాల్గొన్నాను. నాడు ఆయన చేసిన పాదయాత్ర, ఆమరణ నిరాహార దీక్ష కారణంగానే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని అప్పటి సీఎం ఎన్టీఆర్ 4 వేల క్యూసెక్కుల నుంచి 11 వేల క్యూసెక్కులకు పెంచారు. అంతటితో ఆగకుండా ఆయన సీఎం అయ్యాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ఇవేకాకుండా హంద్రీనీవా, గాలేరు-నగరి వంటి ఎన్నోప్రాజెక్టులను పూర్తి చేసి భగీరథుడిగా నిలిచారు. ఇదే ప్రాజెక్టును వైయస్ జగన్ సీఎం అయ్యాక 80 వేల క్యూసెక్కులకు పెంచి 80 శాతం పనులు పూర్తి చేస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా పక్కనపెట్టేశాడు. రాయలసీమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అందరూ ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబుపై పోరాటం చేయాలి.
● జగన్ రాయలసీమను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు: ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు
సీఎం అయిన వెంటనే దుర్భిక్ష పరిస్థితుల మధ్య వ్యవసాయం చేసే రాయలసీమ ప్రాంత రైతుల కష్టాలను తీర్చేసి వైయస్సార్ దేవుడయ్యాడు. గాలేరు-నగరి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులతో రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలను తీర్చారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేసినా వైయస్ జగన్ సీఎం అయ్యాక రాయలసీమ రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. అమరావతిని తప్ప జన్మనిచ్చిన రాయలసీమ ప్రాంతాన్ని చంద్రబాబు పట్టించుకోవడంలేదు. అనుమతులు లేకుండా పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ మనకు దక్కాల్సిన నీటిని వాడుకుంటే చంద్రబాబుకి ఇంకా జ్ఞానోదయం కలగడం లేదు. వైయస్ జగన్ సీఎం అయ్యాక తిరిగి ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేస్తారు. అప్పటిదాకా చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరికీ వివరించాలి. రాయలసీమ ప్రాంత ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాజెక్టు కోసం ఉద్యమించాలి.
● ఎన్జీటీకి ఫిర్యాదు చేసి ప్రాజెక్టును చంద్రబాబు ఆపించాడు: దారా సుధీర్, నందికొట్కూరు పార్టీ ఇన్చార్జి
నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పుట్టి, ఇక్కడ నుంచే గెలిచి ముఖ్యమంత్రి అవుతున్నా.. ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను మాత్రం పట్టించుకోవడం లేదు. వైయస్ జగన్ గారు సీఎం అయ్యాకనే వృథాగా పోతున్న నీటిని రాయలసీమ లిఫ్టు ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించాలని ఆలోచన చేస్తే ఎన్జీటీకి ఫిర్యాదు చేసి చంద్రబాబు ఆపించాడు. అయినా నిర్మాణం ఆపకుండా 80 శాతం పూర్తి చేసిన గొప్ప నాయకులు వైయస్ జగన్. ఇప్పటికైనా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రజల్లో తిరగనివ్వం.
● రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నాడు: అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు
రాయలసీమ నుంచి కరువులు ఆగిపోయాయంటే దాని ఘనత వైయస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైయస్సార్ 44 వేల క్యూసెక్కులకు పెంచితే వైయస్ జగన్ సీఎం అయ్యాక దాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచారు. పనులు ప్రారంభించి రూ. 900 కోట్లకుపైగా ఖర్చు చేసి 80 శాతం పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యావరణ అనుమతులు లేవనే కారణం చూపించి 20 నెలల్లో తట్టమట్టి కూడా తీయలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం ఆయనతో కుమ్మక్కై రాయలసీమ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశాడని అర్థమైపోయింది.
● రాయలసీమ ద్రోహి చంద్రబాబు : సాకె శైలజానాథ్, మాజీ మంత్రి
రాయలసీమ ప్రాంతమంటే చంద్రబాబుకి ఇష్టమే లేదు. అందుకే ఇక్కడి రైతులకు నీళ్లు దక్కకుండా రాయలసీమ లిఫ్టును ఆపేయించాడు.
కర్నూలుకు కేటాయించిన హైకోర్టు, అనంతపురంకి కేటాయించిన ఎయిమ్స్ని అమరావతికి తరలించాడు. ఆఖరుకి కడపలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్ను కూడా తరలించుకోపోయాడు. ఆనాడు వైయస్సార్ సీఎంగా ఉండగా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే ప్రకాశం బ్యారీ మీద ధర్నాలు చేయించి అడ్డుకునే ప్రయత్నం చేసిన రాయలసీమ ద్రోహి చంద్రబాబు. ఇక్కడి రైతులు, ప్రజల భవిష్యత్తును చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కాలరాస్తున్నాడు.
● ఓటుకు కోట్లు కేసుకు భయపడి ప్రాజెక్టును తాకట్టు పెట్టాడు: ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు
రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి మనకు హక్కుగా దక్కాల్సిన నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా సీఎంగా ఉన్న చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. నాడు కేసీఆర్కి, నేడు రేవంత్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తలూపుతున్నాడు. రాయలసీమ ప్రాజెక్టును తిరిగి ప్రారంభింపజేసేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రాయలసీమ ప్రాజెక్టు కోసం రాయలసీమ పౌరుషం చూపించాలి.
● గోదావరి - బనకచర్ల పేరుతో కాలయాపన : తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
శ్రీశైలం డ్యామ్కి ఎక్కువ శాతం భూములు కోల్పోయింది రాయలసీమ ప్రాంతమే. కృష్ణా జలాలపై అత్యధిక క్యాచ్మెంట్ ఏరియా రాయలసీమలోనే ఉంది. చంద్రబాబు ఏనాడూ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయలేదు. దివంగత వైయస్సార్ మరణం తర్వాత వైయస్ జగన్ సీఎం అయ్యే వరకు ఎవరూ ఈ ప్రాంతం గురించి ఆలోచించలేదు. అదిచాలదన్నట్టు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కై వైయస్ జగన్ 80 శాతం పూర్తి చేసిన రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశాడు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నాడు. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి నీటిని తరలిస్తుంటే ఎగువ రాష్ట్రాలు అంగీకరించవు అని తెలిసే.. సాధ్యం కాని ప్రాజెక్టుతో చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు. కృష్ణా, తుంగభద్ర నదులపై నిర్మించాల్సిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గోదావరి- బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించడం మూర్ఖత్వం. వైయస్ జగన్ గెలిచి వుంటే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయేది కాదు. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి.
● లిఫ్టుతోనే రాయలసీమ రైతుల భవిష్యత్తు : రవీంద్రనాథ్రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు
ఈ ప్రాంతానికి సంజీవని లాంటి రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రాజకీయాలకు అతీతంగా రాయలసీమ వాసులంతా ఒక్కటై ఉద్యమించాలి. రాయలసీమను ఎడారిగా మార్చే చంద్రబాబు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. మళ్లీ కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు వలసలు వెళ్లకుండా నిరోధించాలంటే రాయలసీమ ప్రాజెక్టు పూర్తికావాలి. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావాలి. రాయలసీమ లిఫ్టు పూర్తిచేయాలన్న డిమాండ్ తో త్వరలోనే కడపలో రెండో మహాసభ నిర్వహిస్తాం.
● వైయస్ జగన్ని ముఖ్యమంత్రిని చేసుకుందాం: బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు
రాష్ట్రంలో సాగునీటి రంగానికి మేలు చేసిన ఘనత నాడు దివంగత వైయస్ రాజశేఖర్రెడ్డి గారిదైతే, ఇప్పుడు వైయస్ జగన్ గారికే దక్కుతుంది. మళ్లీ వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయితే రాయలసీమ లిఫ్టు పూర్తవుతుంది.
● ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం : గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ
పిల్లలను ఇంటి దగ్గర వదిలేసి పొట్టకూటి కోసం గ్రామాలను వదిలేసి వలసలు వెళ్లే పరిస్థితి నుంచి రాయలసీమ ప్రజలకు విముక్తి కలిగించిన ఘనత వైయస్సార్కే దక్కుతుంది. ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేలా ఉద్యమిస్తాం.
● ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం: భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు
సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేసింది. ఎంత నిర్బంధిస్తే అంతగా తిరగబడతాం. ఎంత అణచివేస్తే అంత పైకిలేస్తాం. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చిన లిఫ్టును రేవంత్రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు ఆపేశాడు. రాయలసీమ ప్రజలకు ద్రోహం చేశాడు. కూటమి నాయకుల వికృత రాజకీయ క్రీడను గ్రామగ్రామానికి తీసుకెళ్తాం. నందికొట్కూరులో మొదలుపెట్టింది ప్రారంభ సభ మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం.
● ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ సీఎం కావడం ఖాయం: కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు
రాష్ట్ర సాగునీటి రంగం గురించి చర్చించాల్సి వస్తే వైయస్ఆర్ కి ముందు వైయస్ఆర్ తర్వాత అని చెప్పుకోవాలి. వైయస్సార్ మరణం తర్వాత సాగునీటి రంగాన్ని తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదు. నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశిల ప్రాజెక్టులను పూర్తి సామర్థ్యం మేరకు నీరు నిలిపిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. రాయలసీమ లిఫ్టు పూర్తయితే నెల్లూరు జిల్లాలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం సాధ్యమైంది. తాను కోరిన మీదటే చంద్రబాబు రాయలసీమ లిఫ్టును ఆపేశాడని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఈ ప్రాజెక్టును తిరిగి మొదలు పెట్టేదాకా ఉద్యమిస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే జగన్ సీఎం కావడం ఖాయం.
● రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉంది: శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
తెలంగాణలో నిర్మించిన అక్రమ ప్రాజెక్టుల ద్వారా రోజూ 8 టీఎంసీల నీరు తరలిస్తున్నారు. దీంతో రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. చంద్రబాబు చేసిన పాపాలకు రాయలసీమలో భవిష్యత్తు తరాలు నష్టపోతాయి. రాయలసీమ ప్రాజెక్టును మొదలుపెట్టేలా అందరూ ఉద్యమించాలి.
● 20 టీఎంసీలు చిన్నవిషయమా? : బుట్టా రేణుక, మాజీ ఎంపీ
ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్టును తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి తాకట్టుపెట్టాడు. పర్యావరణ అనుమతుల పేరుతో ఇంతకాలం డ్రామాలాడినా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీలో చెప్పిన మాటలతో అంతా అబద్ధమేనని తేలిపోయింది. తన డ్రామా బయటపడిపోవడంతో 20 టీఎంసీలే కదా అని చులకన చేసి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మోసాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
● చంద్రబాబు మోసాలను ప్రతి ఒక్కరికీ వివరించాలి: బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, మాజీ మంత్రి
తిరుమల లడ్డూ విషయంలోనే భక్తుల మనోభావాలతో ఆడుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్పై ప్రజలను మాయ చేయడం చాలా చిన్న విషయం. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకాగానే చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ ప్రాజెక్టును ఆపేశాడు. తన మాటలపై నిజనిర్ధారణ కమిటీ కూడా వేస్తానని గట్టిగా మాట్లాడితే దానికి తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానం చెప్పే నాయకుడే లేడు. ఆంధ్రాకి సీఎంగా ఉండి చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశాడని రుజువైనా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తన్నాడు. చంద్రబాబుకి రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ అనేది లేదని 40 ఏళ్లుగా తనని చూసిన వారికి ఎవరికైనా తెలిసిపోతుంది. ఇలాంటి చంద్రబాబు మెడలు వంచి ఆపేసిన ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా ఒత్తిడి తీసుకొద్దాం. చంద్రబాబు చేసిన మోసాలను గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్న ప్రతిపౌరుడికీ తెలిసేలా చేయాలి.
● ప్రాజెక్టు దండగ అని ప్రచారం చేస్తున్నారు: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశాడు. రాయలసీమకు చంద్రబాబు చేసిన మోసం బహిర్గతం అయ్యాక ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన టీడీపీ నాయకులు ఈ ప్రాజెక్టు దండగ అన్నట్టు తప్పుడు ప్రచారం ప్రారంభించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు ప్రాజెక్టులకు శిలఫలకాలు వేయడం, పూర్తి చేసిన వాటికి రిబ్బన్ కటింగ్లు చేసుకోవడం తప్పించి, ఆయన ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. అంటే, చంద్రబాబుకి సాగునీటి రంగమన్నా, రైతులన్నా, వ్యవసాయమన్నా అంత అసహ్యం. అన్ని ప్రాజెక్టులకు నీరివ్వాలన్నా నందికొట్కూరు నుంచే పోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత రైతులు త్యాగాలు చేసి భూములు కోల్పోయారు. సర్వస్వం కోల్పోయి వలసలు పోతున్న రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఉద్యోగాలిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదు.
● మోటర్లు బిగించడమే మిగిలి ఉంది: గోపాల్ రెడ్డి, పోతిరెడ్డిపాడు రైతు, మాజీ సర్పంచ్
శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్లో మా గ్రామం మునిగిపోతే ఈ గ్రామాన్ని ఇక్కడ నిర్మించుకున్నాం. పరిహారం కింద ఆనాడు ప్రభుత్వం ఎకరాకు రూ. 2500, నాలుగు సెంట్ల ఇళ్లుపోతే రూ. 7500 ఇచ్చింది. దాదాపు 66 గ్రామాలు శ్రీశైలం ముంపులో మునిగిపోయాయి. వైయస్ జగన్ గారు సీఎంగా ఉండగా రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. పోతిరెడ్డిపాడు నుంచి సంగమేశ్వరం వరకు 18 కిమీల ఎర్త్ వర్క్, కెనాల్ వర్కులు పూర్తయ్యాయి. మోటార్లు బిగించే స్టేజ్ వచ్చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులన్నీ ఆపేశారు. రాయలసీమ రైతులకు నష్టం చేసి తెలంగాణకు లాభం చేసే చంద్రబాబు చర్యలను చూస్తూ ఊరుకోం.
● వైయస్ఆర్సీపీ హయాంలోనే 80 శాతం పనులు పూర్తి: పుల్యాల నాగిరెడ్డి, జెడ్పీటీసీ
కూటమి ప్రభుత్వం రైతాంగానికి చేస్తున్న మోసాన్ని రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామ ప్రజానీకానికి తెలిసేలా చేయాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది ఉండదని తెలిసినా చంద్రబాబు మాత్రం రేవంత్రెడ్డితో పట్టించుకోవడం లేదు. వైయస్ జగన్ సీఎంగా ఉండగానే రెండేళ్లలోనే 80 శాతం పనులు పూర్తి చేశారు.