విజయవాడ: అందరి కృషి వల్లే కృష్ణా జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కొనియాడారు. జిల్లాలో కరోనా నియంత్రణకు పోలీసులు , డాక్టర్లు,పారిశుద్య కార్మికులు ,ఇతర అధికారులు చాలా కష్ణపడి పనిచేస్తోన్నారని అభినందించారు. కృష్ణా జిల్లాలో కరోనా కేసులపై టాస్క్ ఫోర్స్ మీటింగ్ జరిగింది. సమావేశంలో అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడికి రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలో మీటింగ్ లో చర్చించినట్లు ఆయన తెలిపారు.
ప్రత్యేకంగా డాక్టర్లను నియమించాం
కృష్ణా జిల్లాలో కరోనా నియంత్రణకు ప్రత్యేకంగా డాక్టర్లు ను నియమించినట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. స్వచ్ఛందంగా పని చెయ్యడానికి చాలా మంది డాక్టర్లు ముందుకు వచ్చారని ప్రశంసించారు. జిల్లా లో రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మామిడి దిగుబడి తగ్గింది కాబట్టి మామిడికి కనీస మద్దతు ధర కన్న మార్కెట్లో ఎక్కువే ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వమే భర్తీ చేస్తుంది:
కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉంటే దాన్ని ప్రభుత్వమే భర్తీ చేస్తుందని పెద్దిరెడ్డి వెల్లడించారు. కృష్ణాజిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇప్పటి వరకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, జూన్ నెలాఖరీకి తమ టార్గెట్ను పూర్తి చేస్తామని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.