విజయవాడ: అమరావతి ప్రాంత రైతులకు వార్షిక కౌలు, 2 నెలల పెన్షన్ను సీఎం వైయస్ జగన్ సర్కార్ విడుదల చేసింది. వార్షిక కౌలు రూ.158 కోట్లు, 2 నెలల పెన్షన్ రూ.9.73 కోట్లు విడుదల చేసినట్లు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు కౌలు, 2 నెలల పెన్షన్ బ్యాంకు అకౌంట్లలో ఈ సొమ్ము జమ అవుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అమరావతి రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. రైతులకు వార్షిక కౌలు నిన్ననే బ్యాంకులో జమ చేశామని, సాంకేతిక సమస్యలతో కౌలు రైతులకు చెల్లింపులు ఆలస్యమయ్యాయన్నారు. భూహక్కు పత్రాలు అమ్ముకున్న రైతులకు కౌలు చెల్లింపులు జరగవని, దీనికి సంబంధించిన సర్వే జరుగుతోందని వివరించారు. అమరావతి కౌలు రైతుల పెన్షన్ రూ.5 వేలకు పెంచాలని ప్రభుత్వం భావించిందని, కానీ ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో సాధ్యపడలేదన్నారు. అందుకే ఈ విడతలో రూ.2,500 పెన్షన్ చెల్లించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైందని వివరించారు.