నెల్లూరు: రాష్ట్రంలో ముస్లింల మనోభావాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ముస్లింలను గౌరవిస్తూ, వారికి అండగా నిలుస్తూ వస్తోందని నెల్లూరు పార్లమెంట్ వైయస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్ను నెల్లూరులోని ఆయన నివాసంలో పార్టీ నాయకులతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాను. ఇంతియాజ్కు భవిష్యత్తులో పార్టీలోను, ప్రభుత్వంలోను మంచి పదవులు వస్తాయనే నమ్మకం నాకుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ఏడుగురు ముస్లిం అభ్యర్ధులను సీఎం వైయస్ జగన్ పోటీలో నిలబెట్టారని చెప్పారు. నెల్లూర జిల్లాలో శాంతిభద్రతలు, మతసామరస్యం వెల్లివిరివిరిస్తోందంటే అందుకు ముస్లింలు అందిస్తున్న సహకారమే కారణమన్నారు. వైయస్ఆర్సీపీ తూచా తప్పకుండా సోషల్ ఇంజినీరింగ్ పాటిస్తూ ఆయా కులాలు, మతాలకు వారి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలనేది వైయస్ జగన్ గారి ఎజెండా అని విజయసాయిరెడ్డి తెలిపారు.
మైనార్టీలు కూడా ఆర్ధికంగా, సామాజికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో వైయస్ జగన్ గారు పని చేస్తున్నారు. కాబట్టి నెల్లూరు జిల్లాలో వివిధ పార్టీలలో ఉన్న ముస్లింలు సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తించారని చెప్పారు.