సీఎం వైయస్ జగన్ను కలిసిన ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్
తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ను ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఏపీ, తెలంగాణ) వి.ఎం.రెడ్డి (ఎయిర్ కమోడోర్) మర్యాదపూర్వకంగా కలిశారు.
విపత్తు నిర్వహణలో ఎన్సీసీ క్యాడెట్ల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అంతేకాక ఏపీలో ఎన్సీసీ విస్తరణ ప్రణాళికపై కూడా సమావేశంలో చర్చించారు. అదనంగా 60 వేల మంది ఎన్సీసీ క్యాడెట్లను రిక్రూట్ చేయడం ద్వారా ప్రతి జిల్లాలో ఎన్సీసీ క్యాడెట్లు అందుబాటులో ఉంటారని సీఎంకు డి.డి.జి. వివరించారు.
ఏపి విద్యార్ధులకు సమర్ధవంతమైన శిక్షణను అందించేందుకు వీలుగా ఏపీలో సెంట్రల్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. ఎన్సీసీకి చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్ క్యాడెట్ల శిక్షణ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలతో కూడిన భూమిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు ఎన్సీసీ ఉన్నతాధికారులకు ఈ సమావేశంలో సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎన్సీసీ అసిస్టెంట్ డైరెక్టర్ కల్నల్ సంజయ్ గుప్తా, గ్రూప్ కమాండర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.