తిరుపతి: రాష్ట్రంలో క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరిగా మైదానాలు ఉండాలని, నాణ్యమైన చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా తర్ఫీదునివ్వాలని సీఎం సంకల్పించారని తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న జాతీయ కబడ్డీ పోటీల్లో భాగంగా శుక్రవారం క్రీడాకారులను ఎమ్మెల్యే పరిచయం చేసుకొని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ను భూమన సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కబడ్డీ టోర్నీతో దేశమంతా తిరుపతి వైపు చూస్తోందని చెప్పారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో జాతీయ కబడ్డీ పోటీలను నిర్వహించడం శుభపరిణామమన్నారు. క్రీడాకారులకు ఆటే జీవితమన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రాజంపేట ఎంపీ , లోక్ సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చిత్తూరు జడ్పిచైర్మన్ జి.శ్రీనివాసులు(వాసు), తిరుపతి ఎంపీ గురుమూర్తి , జడ్పిచైర్మన్ తనయుడు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.