వైయస్ఆర్ స్మృతివనాన్ని సందర్శించిన ఎంవీఎస్ నాగిరెడ్డి
కర్నూలు: నల్లమల అటవీ సమీపంలోని వైయస్ఆర్ స్మృతివనాన్ని రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సందర్శించి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానేత వైయస్ఆర్తో ఉన్న అనుబంధాన్ని నాగిరెడ్డి గుర్తు చేసుకున్నారు. వ్యవసాయాన్ని వైయస్ రాజశేఖరరెడ్డి పండుగ చేశారని చెప్పారు. మహానేత ఆశయాలకు అనుగుణంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, వారి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. సాగులో నూతన పద్ధతులు, అధిక దిగుబడులు సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 147 వ్యవసాయ ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎఎంసి ఆధ్వర్యాన ఆక్వా బజార్లు, జనతా బజార్లను ఏర్పాటు చేస్తూ రైతు తాను పండించుకునే పంటలను వారే అమ్ముకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయం ప్రకృతితో ముడిపడకుండా నిరంతరం పంటలకు సాగు నీరందించేందుకు వైయస్ఆర్ జలకళ పథకంలో భాగంగా ఉచితంగా బోరుబావులు వేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం, రైతుల గురించి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్కు మాట్లాడే అర్హత లేదని చెప్పారు.