తాడేపల్లి: గతంలో పుష్కరాల పేరిట టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని, భక్తుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని, ఇప్పుడు జగన్ అతి తక్కువ ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు.
‘హిందూ సంప్రదాయాల్లో పుణ్య స్నానాలకు విశిష్ట స్థానం ఉంది. బాబు హయాంలో పుష్కరాలొచ్చాయంటే భారీ దోపిడీకి స్కెచ్ పడేది. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో 3,400 కోట్ల రూపాయలు మేశాడు. 30 మంది ప్రాణాలు తీశాడు. తుంగభద్ర పుష్కరాలను జగన్ గారు కేవలం 200 కోట్ల రూపాయలతో ఘనంగా నిర్వహిస్తున్నారు’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిన్న తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలోని సంకల్ బాగ్ ఘాట్లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. డిసెంబరు 1 వరకు పుష్కరాలు జరగనున్నాయి.