అమ్మ ఒడి పథకం దేశం అంతటా రావాలి

3 Dec, 2021 15:12 IST

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న అమ్మ ఒడి పథకం దేశమంతటా అమలు చేసేందుకు వీలుగా బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (సవరణ) 2020 పేరిట ఈరోజు రాజ్యసభలో  వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. విద్యాలయాల్లో నమోదయ్యే విద్యార్ధుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు వీలుగా విద్యార్ధి తల్లి లేదా సంరక్షకుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం ఈ బిల్లు ఉద్దేశంగా బిల్లును ప్రవేశపెడుతూ ఆయన వెల్లడించారు.

నిరుద్యోగ భృతి నిరుద్యోగుల హక్కు కావాలి
దేశంలోని 21 నుంచి 60 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లు నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ (సవరణ) బిల్లును  విజయసాయి రెడ్డి ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

ప్రార్ధనా మందిరాలపై దాడులకు పాల్పడే నిందితులకు కఠిన జైలు శిక్ష
ప్రార్ధనా మందిరాలు, స్థలాలపై దాడులు చేసి వాటిని అపవిత్రం చేసే నిందితులకు విధించే జైలు గరిష్ట శిక్షను రెండేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళకు పెంచేలా చట్ట సవరణ చేపట్టేందుకు వీలుగా శ్రీ విజయసాయి రెడ్డి ఈరోజు రాజ్యసభలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (సవరణ) 2021 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వలన టెంపుల్‌ డిస్ట్రక్షన్‌ పార్టీ (టీడీపీ) అరాచకాలకు తెరదించి సమాజంలో శాంతి సామరస్యతలను కాపాడవచ్చని ఆయన అన్నారు.